ETV Bharat / business

'ప్రపంచంలోని అంతర్జాతీయ తయారీ సంస్థలను భారత్​కు రప్పించాలి'

author img

By

Published : Dec 17, 2022, 7:23 AM IST

Finance Minister says to bring international manufacturing companies at FICCI conference
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు భారత్‌కు వచ్చేలా వ్యూహాలు సిద్ధం చేయాలని భారత పరిశ్రమ సంఘాలకు సూచించారు.

పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో.. అక్కడి బహుళజాతి సంస్థలు భారత్‌ను ఓ ప్రధాన తయారీ కేంద్రంగా, వస్తువుల సమీకరణకు అనువైన ప్రాంతంగా గుర్తించి,ఇక్కడకు వచ్చేలా వ్యూహాలు సిద్ధం చేయాలని భారత పరిశ్రమ సంఘాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్‌ ఇప్పటికే పలు నిబంధనల్లో సడలింపులను చేసిందని తెలిపారు. భారత్‌కు తమ తయారీ కేంద్రాలను మార్చాలని అనుకుంటున్న సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి వివరించారు. 'పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం దీర్ఘకాలం పాటు కొనసాగుతుందనే భావన కలిగిన వాళ్లను భారత్‌కు రప్పించే వ్యూహాలను రచించేందుకు ఇదే సరైన సమయమ'ని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నప్పటికీ.. మనదేశంలోనూ కొన్ని ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతులు చేసినా, కనీసం ఈ ప్రాంతంలోని విపణులకు ఉత్పత్తులను ఇక్కడే తయారుచేసినా.. పరస్పర ప్రయోజనం లభిస్తుందని మంత్రి విశదీకరించారు.

చైనా.. ఐరోపాల నుంచి
చైనా నుంచే కాదు.. ఐరోపా నుంచీ తయారీ కేంద్రాలను వేరే చోటకు మార్చేందుకు కొన్ని కంపెనీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడంపై భారత్‌ దృష్టి సారిస్తోందని అన్నారు. తయారీ రంగంతో పాటు సేవల రంగంలో అభివృద్ధికి ఆస్కారం ఉన్న కొత్త విభాగాలపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు.

ప్రపంచ సరఫరాలకు భారత్‌ కీలకంగా మారాలి
ఫిక్కీ సదస్సులో వక్తలు
వైద్య పరిశోధన, సెమీకండక్టర్‌ తయారీ వంటి రంగాల్లో ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిచే సత్తా భారత్‌కు ఉంది. అందువల్ల ఐరోపా/చైనాకు అదనంగా మరో దేశంలా మిగలకుండా, మనమే కీలకంగా మారాల్సి ఉందని శుక్రవారమిక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో పలువురు వ్యక్తలు అభిప్రాయపడ్డారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ అనీశ్‌ షా, బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ అంకుర్‌ గుప్తా, సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ సౌత్‌ ఏషియా సీఈఓ విపుల్‌ తులి తదితరులు మాట్లాడారు.

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌

సంస్కరణలే కీలకం
రాబోయే దశాబ్దాల్లో భారత పనితీరు మారాలంటే సంస్కరణలే కీలకం. 100వ స్వాతంత్ర దినోత్సవాని (2047)కల్లా 25-30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మనదేశం చూస్తోంది. ఈ అభివృద్ధి ప్రయోజనాలు కొందరికి కాక, అందరికీ దక్కడం కీలకం. అసంఘటిత రంగ - వ్యవసాయ కార్మికులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకూ ఆ ఫలాలు అందాలి. కొవిడ్‌ ముందు, తరవాత కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. గత కొన్నేళ్లలో సామాజిక రంగంలో మంచి ఫలితాలు కనిపించాయి. ముఖ్యంగా విద్యుదీకరణ, బ్యాంకు ఖాతాలు, ఆరోగ్య బీమా, మురుగునీటి పారుదల, నెట్‌ అనుసంధానత వంటి వాటిలో ప్రగతి కనిపించింది. లక్షల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా చేసింది భారతే. 2047కు సరికొత్త లక్ష్యాల కోసం బలమైన పునాదిని కేంద్రం ఏర్పాటు చేసింది. వచ్చే కొన్ని దశాబ్దాల్లో భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలున్నాయి.

ప్రధాన దేశంగా అవతరిద్దాం
‘అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్‌ కీలకంగా మారాలంటే.. వ్యాపారాలు, పెద్ద సంస్థలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల మధ్య భాగస్వామ్యాలు పెరగాలి. మరిన్ని ఆవిష్కరణలు జరగాలి. చైనా ప్లస్‌ వన్‌ దేఅం, ఐరోపా+ వన్‌ దేశం అంటున్నారు. అంటే ఆయా దేశాలకు అదనంగా మనం అనేది భావన. అలా ఎందుకుండాలి.. ప్రధాన దేశంగానే ఉండాలి కదా? ఎందుకలా ఉండలేకపోతున్నాం. మన దగ్గర అత్యుత్తమ నైపుణ్యం గల మానవ వనరులున్నారు. మన విశ్వవిద్యాలయాల్లో వినూత్న పరిష్కారాలు రూపొందుతున్నాయి. మనకు తయారీ బలం కూడా ఉంది. అందుకు ప్రభుత్వమూ మద్దతు ఇస్తోంది. కాబట్టి మనం ప్లస్‌ వన్‌లో కాకుండా ప్రధాన దేశంగా మారాలి. అంతర్జాతీయ దిగ్గజాలతో దేశీయ తయారీదార్లయిన మహీంద్రా, టాటా మోటార్స్‌ పోటీ పడడం కాదు.. పైచేయి సాధిస్తున్నాయి కూడా. భారత్‌లోనే గెలవగలిగినపుడు.. ప్రపంచాన్ని ఎందుకు గెలవకూడదు. మనకు ఆ సామర్థ్యం ఉన్నపుడు ఆ దిశగా ఎందుకు చేయకూడదు?

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ అనీశ్‌ షా

చట్టసభలు, కంపెనీ బోర్డుల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలి
కల్పనా మోర్పారియా, నైనాలాల్‌ కిద్వాయ్‌ సూచన
చట్టసభలు, కంపెనీల బోర్డుల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని మహిళా వ్యాపార ప్రముఖులు కల్పనా మోర్పారియా, నైనాలాల్‌ కిద్వాయ్‌ సూచించారు. సొంతంగా ఉన్నత స్థాయికి వెళ్లడానికి మహిళలు ఇష్టపడతారని.. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే కంపెనీ బోర్డులో మహిళలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేందుకు రిజర్వేషన్‌ అవసరమని అభిప్రాయపడ్డారు. ఫిక్కీ వార్షిక సదస్సులో వీరు మాట్లాడారు.

  • పార్లమెంట్‌ వంటి చట్టసభలకు మహిళలు అధికంగా ఎన్నికయ్యేందుకు వీలుండటం లేదని, తప్పనిసరి రిజర్వేషన్‌తోనే ఎక్కువమంది మహిళలు వెళ్లేందుకు అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ దక్షిణాసియా మాజీ ఛైర్మన్‌ మోర్పారియా అన్నారు. కంపెనీల బోర్డుల్లో మహిళలకు తప్పనిసరి ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధన తరవాత, పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని వివరించారు. అందువల్ల కంపెనీల బోర్డుల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ ఉండాలని సూచించారు.
  • పంచాయతీల్లో ఇప్పటికే రిజర్వేషన్‌ ఉందని, పార్లమెంట్‌లోనూ ఇదే తరహాలో అందించాలని రోత్స్‌ఛైల్డ్‌ అండ్‌ కో ఇండియా ఛైర్‌పర్సన్‌ కిద్వాయ్‌ పేర్కొన్నారు. మహిళలను అభ్యర్థులుగా నిలబెట్టి, పంచాయతీల్లో పురుషులు లబ్ధి పొందుతున్న ఉదంతాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే క్రమంగా ఈ పరిస్థితి మారి, మహిళలే తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారని తెలిపారు.
  • ఇవీ చదవండి:
  • కొత్తగా మదుపు చేద్దామనుకుంటున్నారా?.. ఈ విషయాలు మీకోసమే!
  • 'వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమే'.. ఆర్​బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.