ETV Bharat / business

కొత్తగా మదుపు చేద్దామనుకుంటున్నారా?.. ఈ విషయాలు మీకోసమే!

author img

By

Published : Dec 16, 2022, 2:59 PM IST

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం ఛాయలున్నప్పటికీ.. మన దేశంపై ఆ ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్న వారు మ్యూచువల్‌ ఫండ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ దశలో ఆర్థిక లక్ష్యాల సాధనకు మదుపు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించాలి.

Investments in financial planning
ప్రణాళికతో మదుపు

ఆర్థిక ప్రణాళిక.. పెట్టుబడులు మనలో చాలామంది ఇవన్నీ ఒకటే అనుకుంటారు. ఆర్థిక ప్రణాళికలో పెట్టుబడులు ఒక భాగం. మన జీవితంలోని వివిధ దశల్లో అవసరమైన నిధులు, వాటిని ఎలా సాధించాలి అనేది స్థూల ప్రణాళిక. దీనిద్వారానే మనం ఏం చేయాలి? ఎలాంటి పెట్టుబడులను ఎంచుకోవాలి?అనే వివరాలు తెలుసుకోవడం సులభం అవుతుంది. స్వల్ప-మధ్యస్థ-దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేందుకు ఇది తోడ్పడుతుంది. సరైన ప్రణాళిక లేనప్పుడు ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు ఇలా ఏ విషయంపైనా మనకు పట్టు ఉండదు. దీంతో అవసరమైనప్పుడు ఏం చేయాలన్న సంగతి తెలియక ఆందోళన తప్పదు. కాబట్టి, పెట్టుబడులు ప్రారంభించే ముందు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

లక్ష్యాలను గుర్తిస్తూ..
జీవితంలో కీలకమైన ఆర్థిక లక్ష్యాలను ముందుగా గుర్తించాలి. ఇందులో ఇల్లు కొనడం, పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహం, మీ పదవీ విరమణ ప్రణాళికల్లాంటివి ఉంటాయి. లక్ష్యాలను గుర్తించడం, వాటికి అవసరమైన మొత్తాలను అంచనా వేయడం.. ఎంతో కీలకమైన అంశాలు. చాలామంది వీటి విషయంలో ముందు నుంచీ జాగ్రత్త తీసుకోరు. తీరా సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఎంత మొత్తం కేటాయించినా ఆశించిన ఫలితం అంత తేలిగ్గా లభించదు.

ప్రాధాన్యత ఆధారంగా..
మీ లక్ష్యాలను గుర్తించిన తర్వాత వాటికి ప్రాధాన్యత క్రమాన్ని ఇవ్వాలి. మీ దగ్గర ఇప్పటికే ఉన్న వనరులు, భవిష్యత్‌ పెట్టుబడుల ఆధారంగా వేటిని సాధించగలం, వేటిని వాయిదా వేయాలి అనేది తెలుసుకోవాలి. ఖరీదైన వస్తువులు కొనడం, విహార యాత్రలకు వెళ్లడంలాంటి వాటికన్నా ముందు.. పదవీ విరమణ ప్రణాళికలు ముఖ్యం. పిల్లల అవసరాలను తీరుస్తునే.. పదవీ విరమణ తర్వాత మీకు అవసరమైన ఆదాయానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. సంపాదన ప్రారంభమైనప్పుడే రిటైర్మెంట్‌ పెట్టుబడులూ మొదలు పెట్టాలి.

ప్రత్యేకంగా..
అన్ని లక్ష్యాలకూ ఒకే వ్యవధి ఉండదు. కాబట్టి, విడివిడిగా పోర్ట్‌ఫోలియోలను సృష్టించాలి. కొందరు 3-5 ఏళ్ల వ్యవధిలో సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉండొచ్చు. మరికొందరికి పిల్లల చదువుల ఖర్చు 10-15 ఏళ్ల తర్వాత రావచ్చు. వారి వివాహానికి 20 ఏళ్ల వ్యవధి ఉంటుంది. పదవీ విరమణ కోసం మరో 30 ఏళ్లు ఉండొచ్చు. ఇలా ఒకే కాల వ్యవధి లక్ష్యాలు లేనప్పుడు.. మదుపు చేసే పథకాలూ భిన్నంగానే ఉండాలి. సమీప లక్ష్యాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేయొద్దు. ఉదాహరణకు పిల్లల చదువుల ఖర్చు ఉంది కదా.. అని పదవీ విరమణ కోసం పెట్టుబడులు పెట్టకపోవడం పొరపాటు.

సుదీర్ఘ పెట్టుబడులుగా ఈక్విటీలకు పేరుంది. ఇతర పెట్టుబడులతో పోలిస్తే దీర్ఘకాలంలో ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని అందిస్తాయి. మార్కెట్లో ఎక్కువ కాలం కొనసాగాలనే ఆలోచన ఉన్నప్పుడే వీటిని ఎంచుకోవాలి. నేరుగా షేర్లలో మదుపు చేసినా, ఈక్విటీ ఫండ్ల ద్వారా పరోక్షంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా.. ఇదే సూత్రం వర్తిస్తుంది. స్వల్ప, మధ్య కాలిక లక్ష్యాల కోసం నష్టభయం తక్కువగా ఉండే పథకాలే ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు పథకాలు, బాండ్లు, డెట్‌ పథకాలను ఇందుకోసం పరిశీలించాలి. మూలధన అస్థిరతను తట్టుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేటప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే వీలు, వచ్చిన రాబడిపై పన్ను భారం, తప్పనిసరిగా కొనసాగాల్సిన వ్యవధి తదితరాలను గమనించాలి.

ఎంత మొత్తం..
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది చూడాలి. ప్రతి ఖర్చునూ ద్రవ్యోల్బణంతో లెక్కగట్టి చూడటం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు మీ అమ్మాయి వివాహానికి ఇప్పుడు రూ.25లక్షలు ఖర్చవుతుందనుకుందాం. సగటున 5 శాతం ద్రవ్యోల్బణంతో లెక్కగడితే.. 21 సంవత్సరాల తర్వాత రూ.70లక్షలు అవసరం. కనీసం 12 శాతం రాబడిని ఆర్జించే పెట్టుబడి పథకాల్లో మదుపు చేసినప్పుడే ఈ ఖర్చును తట్టుకోగలం. ఇలా ప్రతి అవసరాన్నీ లెక్కించుకోవాలి. అప్పుడే మీరు సరైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు వీలుగా ఒక ఆర్థిక ప్రణాళిక సిద్ధం అవుతుంది. స్వల్ప, మధ్య కాల లక్ష్యాలకు సంప్రదాయ పథకాలను ఎంచుకునేటప్పుడు వడ్డీ రేటును ఆధారంగా పెట్టుబడి మొత్తం మారుతుంది.

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో హెచ్చుతగ్గులు సహజం. నేడు పెరిగిన మార్కెట్‌.. రేపు తగ్గొచ్చు.. ఇది నిరంతరం కొనసాగే ఒక చక్రం.. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు ఎంచుకున్నప్పుడు స్వల్పకాలిక ఆటుపోట్లను పట్టించుకోవద్దు. ఇక్కడ కావాల్సిందల్లా.. క్రమం తప్పకుండా మదుపు చేసే ఆర్థిక క్రమశిక్షణ. పెట్టుబడులకంటే ముందు ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ వార్షికాదాయం, బాధ్యతలను బట్టి తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.