ETV Bharat / business

'చిన్న పట్టణాల నుంచీ స్టాక్​మార్కెట్లోకి పెట్టుబడులు'

author img

By

Published : Aug 1, 2021, 6:48 AM IST

'కరోనా పరిణామాల నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి స్టాక్‌ మార్కెట్లో చిన్న మదుపర్ల భాగస్వామ్యం పెరిగింది.  లావాదేవీలు సులభంగా, సురక్షితంగా తక్కువ వ్యయంతో నిర్వహించుకునే వీలుండటమే మా సంస్థ వృద్ధికి కారణమ'ని అంటున్నారు ఆన్‌లైన్‌ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ 'గ్రో' సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హర్ష్‌ జైన్‌. 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు విషయాలు చెప్పారు. ఆ వివరాలిలా..

harsh jain
హర్ష్​ జైన్, గ్రో సహ వ్యవస్థాపకుడు

లావాదేవీలు సులభంగా, సురక్షితంగా తక్కువ వ్యయంతో నిర్వహించుకునే వీలుండటమే తమ సంస్థ వృద్ధికి కారణమని ఆన్‌లైన్‌ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ 'గ్రో' సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హర్ష్‌ జైన్‌ పేర్కొన్నారు. చిన్న పట్టణాల నుంచీ స్టాక్‌మార్కెట్లోకి పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరిగిందని చెప్పారు. 'ఈనాడు'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఎన్నో సంస్థలు ఆర్థిక/స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత సేవలు అందిస్తున్నాయి. మీ ప్రత్యేకతలు ఏమిటి?

యువతను ఆకర్షించేందుకు, వారు పెట్టుబడులు పెట్టేందుకు గ్రో ఎంతో సులువైన, పారదర్శక వేదికను అందిస్తోంది. మదుపరి తాను అనుకున్న ఏ పథకంలోనైనా మదుపు చేసేలా చూడటమే గ్రో లక్ష్యం. సరైన పెట్టుబడి నిర్ణయం తీసుకునేందుకు, అవసరమైన సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ట్రేడింగ్‌ లావాదేవీకి రూ.20 మినహా, ఇతర ఛార్జీలేమీ లేకుండా, సులువుగా మదుపు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాం.

గత అయిదేళ్లలో గ్రో ఎంతో వృద్ధి సాధించింది. ఇందుకు దోహదం చేసినవేమిటి?

దేశంలో 20 కోట్ల మందికి పైగా పెట్టుబడులు పెట్టే ఆర్థిక స్తోమత ఉన్నా, 4-5 కోట్ల మందే ఈక్విటీల్లో మదుపు చేస్తున్నారు. చాలామంది భారతీయుల డబ్బు.. బ్యాంకు పొదుపు ఖాతాలకే పరిమితం అవుతోంది. దీనివల్ల వారికి వస్తున్న రాబడి తక్కువే. అదే సమయంలో విదేశీ సంస్థాగత మదుపరులు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిని సొమ్ము చేసుకుంటున్నారు. రిటైల్‌ మదుపరుల్లో ముఖ్యంగా సంపాదన శక్తి ఉన్న యువతను ఈక్విటీ పెట్టుబడుల్లో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కొవిడ్‌ పరిణామాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, వడ్డీ రేట్లు తగ్గాయి. మంచి షేర్లు తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చాయి. ఆఫీసులకు వెళ్లే వారు.. ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించారు. దీంతో వారు తమ దగ్గరున్న మిగులు మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో నేర్చుకునే ప్రయత్నం చేశారు. గ్రో లాంటి యాప్‌లు అందుబాటులోకి రావడంతో, కాగిత రహితôగా, ఎవరినీ కలవాల్సిన పని లేకుండా.. నిమిషాల్లోనే మార్కెట్లో పెట్టుబడులు సాధ్యం అయ్యాయి. తక్కువ బ్రోకరేజీ, ఒకే వేదికపై ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉండటమూ మరో కారణం.

చిన్న మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతికత ఎంత మేరకు తోడ్పాటునందిస్తోంది?

తక్కువ, స్థిర రాబడి వచ్చే సంప్రదాయ పెట్టుబడి పథకాల నుంచి ఆర్థిక పెట్టుబడులను ఆకర్షణీయ ప్రతిఫలాలు వచ్చే పథకాల్లోకి మళ్లించేందుకు సాంకేతికత ఉపయోగపడుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నేను పనిచేస్తున్నప్పుడు, వినియోగదారుల అంచనాలను అందుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగుతాయని గమనించాను. పెట్టుబడులకూ ఇదే వర్తిస్తోంది.

ఏ వయసు వారు ఇపుడు ఎక్కువగా మదుపు చేస్తున్నారు.?

స్టాక్‌మార్కెట్లో అన్ని వయసుల వారి భాగస్వామ్యం పెరుగుతోంది. మా వరకు వస్తే.. 30 ఏళ్లలోపు వారు మా దగ్గర 65-70% వరకు ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతోపాటు, చిన్న పట్టణాల నుంచీ మదుపు చేసేవారు పెరిగారు. గ్రో ద్వారా మదుపు చేసేవారిలో 60% మంది ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నారు.

ఆర్థిక సేవల రంగం భారత్‌లో ఎలా ఉంది? భవిష్యత్‌లో ఎలాంటి వృద్ధిని నమోదు చేయొచ్చు?

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ఆర్థిక సేవల రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆదాయాలు పెరుగుతున్నప్పుడు ఈ సేవలకు గిరాకీ పెరుగుతుంది. 2035 నాటికి ఆర్థిక సేవల రంగంలో ఎంతో వృద్ధి కనిపిస్తుంది. ఆదాయాలు పెరగడం, ప్రభుత్వం అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం, డిజిటలీకరణ తదితరాల నేపథ్యంలో ఇండియా డిజిటల్‌ పేమెంట్స్‌ 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది.

రాబోయే అయిదేళ్లలో మీ లక్ష్యాలేమిటి?

రాబోయే రోజుల్లో డెరివేటివ్స్‌, ఇంటర్నేషనల్‌ ఈక్విటీ, తక్కువ నష్టభయం ఉన్న పెట్టుబడి పథకాలను అందిస్తాం. ఆర్థిక విజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాం.

యూనికార్న్‌ కంపెనీ..

స్టాక్‌ మార్కెట్‌తో పాటు, ఇతర పథకాల్లో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించే వేదిక 'గ్రో'. 2017లో ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బయటకు వచ్చిన లలిత్‌ కేశ్రే; హర్ష్‌ జైన్‌, నీరజ్‌ సింగ్‌, ఇశాన్‌ బన్సాల్‌ దీన్ని ప్రారంభించారు. ఈ ఏప్రిల్‌లో 'గ్రో' యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు-రూ.7500 కోట్ల విలువ) కంపెనీగా ఎదిగింది. భారత్‌లో యూనికార్న్‌ హోదా సాధించిన రెండో ఫిన్‌టెక్‌ సంస్థ ఇది.

ఇదీ చూడండి: యాపిల్​ సీఈవో కావాలనుకున్న ఎలాన్‌ మస్క్‌!

ఇదీ చూడండి: జియో ధమాకా రీఛార్జ్.. ఒకటి కొంటే మరొకటి ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.