ETV Bharat / business

మూడు శ్లాబులకు జీఎస్​టీ రేట్ల తగ్గింపు!

author img

By

Published : Jul 30, 2021, 10:20 AM IST

GST Slabs to reduce soon
జీఎస్​టీ శ్లాబుల తగ్గింపు

ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్​ జీఎస్​టీ రేట్ల హేతుబద్దీకరణపై కీలక విషయాలు వెల్లడించారు. జీఎస్​టీ రేట్లను మూడు శ్లాబులకు తగ్గించడం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ అజెండాలో కూడా ఈ అంశం ఉందని వివరించారు.

ప్రభుత్వ అజెండాలో వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) రేట్ల హేతుబద్దీకరణ ఉందని.. కచ్చితంగా అది జరుగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్​ తెలిపారు. మూడు రేట్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని ఆయన వివరించారు. ఎక్సైజ్​ సుంకం, సేవా పన్ను, వ్యాట్​ వంటి డజనుకుపైగా కేంద్ర, రాష్ట్ర సుంకాలను కలిపి జీఎస్​టీని..2017 జులైలో అమలులోకి తెచ్చింది కేంద్రం.

ప్రస్తుతం జీఎస్​టీలో 0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబులున్నాయి. రేట్ల హేతుబద్దీకరణ ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. 'ముందుగా అనుకున్నది మూడు రేట్ల విధానమే. అందువల్ల కచ్చితంగా హేతుబద్దీకరణ ఉంటుంది. ఇవ్వర్టెడ్ సుంకాల విధానం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం కచ్చితంగా త్వరలోనే నిర్ణయం తీసుకుటుందని భావిస్తున్నా'నని ఆయన అన్నారు.

జులైలో టోకు ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు వస్తుందని.. 5 శాతం పైన కొంత కాలంపాటు కొనసాగే అవకాశం ఉందని సుబ్రమణియన్ అంచనా వేశారు. మూడు త్రైమాసికాలుగా ఆర్​బీఐ నిర్దేశించిన గరిష్ఠ లక్ష్యం కంటే అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి:Gold Rate Today: ఏపీ, తెలంగాణలో భారీగా పెరిగిన బంగారం ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.