ETV Bharat / business

దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? రష్యా 'డిస్కౌంట్' చమురుతో కేంద్రం స్కెచ్!

author img

By

Published : Mar 14, 2022, 7:13 PM IST

Updated : Mar 15, 2022, 6:49 PM IST

russian crude oil discount
russian crude oil discount

Russian crude oil discount: రష్యా నుంచి ముడి చమురును డిస్కౌంట్​కు కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినందున.. పుతిన్ ఇచ్చే రాయితీతో ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటోంది. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ పార్లమెంట్ వేదికగా స్పష్టతనిచ్చారు.

Russian crude oil discount: దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికలకు ముందు వార్తలు వచ్చాయి. అయితే, ఇంతవరకు ధరలు పెరిగింది లేదు. మరోవైపు, ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు సరికొత్త గరిష్ఠానికి చేరుకుంటున్నాయి. అటు, రష్యాపై ఆంక్షలు ఉన్నందున ఆ దేశంలో చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ పరిణామాలను భారత్ అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రష్యా నుంచి చౌకగా..

రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. డాలర్లలో కాకుండా రూపాయి-రూబుల్ మారకాన్ని బట్టి లావాదేవీలు జరపాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని ఇద్దరు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

India Russia crude oil imports

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తమపైనా ఆంక్షలు తప్పవేమో అన్న అనుమానాలతో పలు దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. అయితే, ఆంక్షల భయాలు భారత్​ను నిలువరించలేవని అధికారులు చెబుతున్నారు.

"చమురుతో పాటు చాలా ఉత్పత్తులను భారీ డిస్కౌంట్​కు రష్యా ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్​తో చమురును కొనుగోలు చేయడం మాకు సంతోషమే. అయితే, ట్యాంకర్ల కొరత, ఇన్సూరెన్స్, చమురు మిశ్రమాలకు సంబంధించి కొన్ని చిక్కులు ఉన్నాయి. ఇవి పరిష్కారమైతే డిస్కౌంట్ ఆఫర్ తీసుకుంటాం."

-కేంద్ర ప్రభుత్వ అధికారులు

అయితే, రష్యా నుంచి ఎంత చమురును దిగుమతి చేసుకోనున్నారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఎంత డిస్కౌంట్ లభిస్తోందనే విషయంపైనా వివరాలు తెలియజేయలేదు.

India Crude oil imports

భారత్ తన ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే ఆధారపడింది. అయితే, రష్యా నుంచి 2-3శాతం చమురును మాత్రమే కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. డిస్కౌంట్​కు కొనుగోలు చేస్తే ఖజానాపై భారం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

ఆర్థిక ప్రయోజనం కోసం...

ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 50 బిలియన్ డాలర్లకు పైగా ఈ దిగుమతులపైనే వెచ్చించాల్సి ఉంటుందని కేంద్రం లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చౌకగా లభించే ముడి సరకులకు ప్రాధాన్యం ఇస్తోంది. రష్యాతో పాటు బెలారస్ నుంచి ఎరువులనూ దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. రైతులకు ఎరువులపై రాయితీ ఇస్తున్న నేపథ్యంలో.. ఖజానాపై రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్ల వరకు అదనంగా భారం పడనుంది. 'అందువల్ల రష్యా నుంచి కూడా తక్కువ ధరకు ఫర్టిలైజర్లను దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నాం. దీని వల్ల ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది' అని అధికారులు చెప్పారు.

వ్యాట్ తగ్గించని రాష్ట్రాలు...

మరోవైపు.. మహారాష్ట్ర, కేరళ సహా 9 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ తగ్గించలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ రాజ్యసభకు తెలిపారు. కరోనా సమయంలో వివిధ దేశాల్లో పెట్రోల్ ధరలు 50 శాతం పెరిగితే.. భారత్​లో 5శాతం మాత్రమే పెరిగాయని చెప్పుకొచ్చారు. ధరలు తగ్గించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనపై జీఎస్టీ మండలిలో సభ్యులు సుముఖత వ్యక్తం చేయలేదని అన్నారు.

Petrol rates in States

ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళలో పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్నాయని చెప్పారు. డిస్కౌంట్​కే చమురు విక్రయిస్తామన్న రష్యా ప్రతిపాదన కథనాలపై స్పందిస్తూ.. ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని స్పష్టం చేశారు. రష్యా అధికారులతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ఇవి పూర్తైతే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

ద్రవ్యోల్బణం భగభగ

మరోవైపు, చమురు ధరల పెరుగుదల కారణంగా దేశంలో టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 13.11 శాతానికి పెరిగింది. గతేడాది ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగుతోంది. అయితే, కూరగాయాలు, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గింది. ముడి పెట్రోలియం ద్రవ్యోల్బణం జనవరిలో 39.41 శాతం ఉండగా.. ఫిబ్రవరికి 55.17 శాతానికి ఎగబాకింది.

ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 6.07 శాతంగా ఉందని గణాంకాల్లో వెల్లడైంది.

బంగారం సంగతేంటి?

Gold rate today: దేశంలో పసిడి ధర పడిపోయింది. దిల్లీలో సోమవారం పది గ్రాములకు రూ.362 మేర పతనమైంది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.52,443కు చేరింది. అంతర్జాతీయ బలహీన పవనాలు, వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయంపై ఆందోళనల మధ్య పసిడి ధరలు పడిపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

దిల్లీలో వెండి ధర సైతం పడిపోయింది. కేజీ వెండి రూ.612 తగ్గింది. ప్రస్తుతం రూ.69,665 వద్ద స్థిరపడింది.

ప్రస్తుతం హైదరాబాద్​లో బంగారం ధర రూ.53,660గా ఉంది. కేజీ వెండి ధర 70,340 పలుకుతోంది.

ఇదీ చదవండి: ఎల్‌ఐసీ ఐపీఓకి మే 12 వరకే గడువు.. ఆ తర్వాత..

Last Updated :Mar 15, 2022, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.