ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: నష్టాల బాటలో విమానయాన రంగం

author img

By

Published : Mar 13, 2020, 5:50 AM IST

Coronavirus headwinds rattle airlines
కరోనా కారణంగా నష్టాల్లో భారత విమానయానం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వైరస్​ ప్రభావం విమానయాన రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే భారత్​లో సుమారు 500 విదేశీ విమానాలు రద్దవగా.. మరో 90కి పైగా దేశీయ విమానాలను నిలిపివేశారు అధికారులు.

కరోనా ఎఫెక్ట్​: నష్టాల బాటలో విమానయాన రంగం

కొవిడ్​-19 (కరోనా వైరస్)​ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్​ దెబ్బకు పలు రంగాలు ఇప్పటికే మూలనపడ్డాయి. వైరస్​ వ్యాప్తి విమానయాన రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వందలాది విమానాలు రద్దయ్యాయి. ఫలితంగా బుకింగ్స్​తో సహా విమానాశ్రయంలోని దుకాణాల్లో అమ్మకాలు పడిపోయాయి.

అతికష్టం మీద విమానయాన సంస్థలను నడుపుతున్నారు నిర్వాహకులు. భారత్​తో సహా ప్రపంచవ్యాప్తంగా విధించిన ప్రయాణ ఆంక్షలు, ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల విమానయాన సంస్థలపై పెనుభారం పడిందని నిపుణులు పేర్కొన్నారు.

ఏప్రిల్​ 15 వరకు వీసాల రద్దు

వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే భారత్​లో సుమారు 490కి పైగా విదేశీ విమానాలు రద్దయ్యాయి. మరో 90కి పైగా దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. కరోనా మహమ్మారిని నియత్రించేందుకు భారత్​ ఇప్పటికే దౌత్య, ఉద్యోగ సంబంధిత వీసాలు మినహా అన్నింటినీ ఏప్రిల్​ 15 వరకు నిలిపివేసింది.

70 వేల నుంచి 62వేలకు..

కరోనా కారణంగా భారత్​కు వచ్చే విదేశీ ప్రయాణికుల సంఖ్య 70 వేల నుంచి 62 వేలకు తగ్గిందని పౌరవిమానయాన మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి తెలిపారు. ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

త్రైమాసిక ఆదాయంపైనా ప్రభావం..

కరోనా నేపథ్యంలో రోజువారీ బుకింగ్​లు 15-20 శాతం మేర తగ్గిపోయాయని భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. ఈ ఫలితాలు త్రైమాసిక ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని సంస్థ తెలిపింది.

ప్రస్తుతం విమానయానరంగం తీవ్ర ఒత్తిడికి గురవుతుందని అయితే ఇదంతా తాత్కాలికమేనని స్పైస్​ జెట్​ ఛైర్మన్​, ఎండీ అజయ్​ సింగ్​ అన్నారు.

ఇదీ చదవండి: కరోనా దెబ్బకు 1962 తర్వాత ఇరాన్​ తొలిసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.