ETV Bharat / business

ఆద్యంతం ఒడుదొడుకులు- చివరకు స్వల్ప లాభాలు

author img

By

Published : Nov 2, 2020, 3:50 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగింది. బ్యాంకింగ్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రికార్డు స్థాయి నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

SHARE MARKETS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు

ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన సెషన్​లో స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సోమవారం సెషన్​లో బీఎస్ఈ-సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో 39,757 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి.. 11,669 వద్ద స్థిరపడింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి.. దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రికార్డు స్థాయిలో పతనమవ్వడం వల్ల సెషన్​ మొత్తం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి సూచీలు. అయితే ఆసియాలో ఇతర మార్కెట్లు సానుకూలంగా స్పందించడం వల్ల చివరి గంటలో నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. బ్యాంకింగ్ షేర్ల అండతో ఎట్టకేలకు లాభాలను నమోదు చేయగలిగాయి.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,968 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,334 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,697 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,557 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ షేర్లు లాభాలను గడించాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు రికార్డు స్థాయిలో 8 శాతానికిపైగా నష్టపోయాయి. హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ, హాంగ్​సెంగ్​ సూచీలు లాభాలను గడించాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి 32 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 74.42 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 3.08 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 36.77 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:అక్టోబర్​లో తయారీ రంగ పీఎంఐ రికార్డు వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.