ETV Bharat / business

కరోనా కాలంలోనూ ఈ వ్యాపారాల్లో జోష్‌

author img

By

Published : Apr 18, 2020, 2:27 PM IST

కరోనా నేపథ్యంలో పలు కంపెనీలు మూతపడితే మరికొన్ని కంపెనీల వ్యాపారాలు మాత్రం పుంజుకున్నాయి. కరోనా వ్యాప్తితో విధించిన లాక్‌డౌన్ కూడా ఇందుకు ఓ కారణమైంది. అలా వృద్ధి చెందిన కొన్ని వ్యాపారాల విశేషాలు మీ కోసం.

business growth in corona crisis
కరోనా కాలంలోనూ పలు వ్యాపారాల జోరు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్రం. ఈ నేపథ్యంలో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఇలాంటి సమయాల్లోనూ కొన్ని వ్యాపారాలు మాత్రం దూసుకుపోతున్నాయి. ఆ వ్యాపారాలు ఏవి? వాటి దూకుడుకు కారణాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.

పేటీఎం..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగదు వినియోగం భారీగా తగ్గిపోయింది. ఎక్కువ మంది డిజిటల్‌ లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పేటీఎం వంటి డిజిటల్ వాలెట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు ప్రజలు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు, వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు తమ ప్లాట్‌ఫాం ద్వారా బిల్లుల చెల్లింపు 200 శాతం పెరిగినట్లు పెటీఎం వెల్లడించింది.

మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 మధ్య మొబైల్ రీచార్జీలు 42 శాతం, డీటీహెచ్‌ రీచార్జీలు 58 శాతం, గ్రాసరీ, ఫార్మాల్లో 30 శాతం, పాల ఉత్పత్తుల కొనుగోళ్ల చెల్లింపులు 15 శాతం పెరిగినట్లు తెలిపింది.

గూగుల్‌ మీట్‌కు 20 లక్షల కొత్త యూజర్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్నేహితులు, సన్నిహితులతో మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో గూగుల్‌ మీట్‌కు రోజుకు 20 లక్షల కొత్త యూజర్లు లాగ్‌ఇన్ అవుతున్నట్లు గూగుల్ తెలిపింది.

'గూగుల్ మీట్‌కు జనవరి నుంచి ఇప్పటి వరకు 25 శాతం మంది యూజర్లు పెరిగారు. ఇటీవల రోజూవారి యూజర్లలో 60 శాతం వృద్ధి నమోదవుతోంది. గడిచిన రెండు వారాల నుంచి సగటున రోజుకు రెండు మిలియన్ల కొత్త యూజర్లు గూగుల్ మీట్‌ను వాడటం ప్రారంభిస్తున్నారు' అని గూగుల్ అధికారులు తెలిపారు.

శానిటైజర్ల కంపెనీల దూకుడు..

కరోనా సంక్షోభానికి ముందు వరకు పెద్దగా పరియచం లేని హ్యాండ్ శానిటైజర్ల కంపెనీల వ్యాపారం ఆ తర్వాత భారీగా పెరిగింది. ఇప్పుడిప్పుడే కొత్తగా మార్కెట్​లోకి వచ్చిన కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు రెట్టింపయ్యాయి. కేవలం మార్చి నెలలోనే అలాంటి కంపెనీల శానిటైజర్ల అమ్మకాలు 61 శాతం పెరిగినట్లు ఓ సర్వే తెలిపింది.

కొత్త కంపెనీల దెబ్బకు ఈ సెగ్మెంట్‌లో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలైన రెక్కిట్‌ బెంకీజర్‌ (డెటాల్), ఐటీసీ (సావ్లా​న్‌), హెచ్‌యూఎల్‌ (లైఫ్‌బాయ్)ల మార్కెట్‌ వాటా 38 శాతానికి పడిపోయింది. గోద్రేజ్‌, హిమాలయా డ్రగ్ కంపెనీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తొలి మూడు స్థానాల్లో ఉన్న కంపెనీల వాటా(హ్యాండ్‌ శానిటైజర్ల విభాగంలో ) జనవరి, ఫిబ్రవరిలో 85 శాతం వరకు ఉండేది.

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన చిన్న కంపెనీల వాటా ఇప్పుడు 45 శాతానికి పెరిగింది.

కొత్తగా మార్కెట్లోకి..

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలైన డాబర్‌, ఇమామీ, పతాంజలి వంటి సంస్థలు తమ శానిటైజర్‌ ఉత్పత్తులను ఈ నెలలోనే మార్కెట్లోకి అవిష్కరించాయి. వాటి అమ్మకాలు పుంజుకుంటున్నట్లు ప్రకటించాయి. పలు లిక్కర్‌ కంపెనీలు కూడా శానిటైజర్ల ఉత్పత్తిని ప్రారంభించాయి.

ఇదీ చూడండి:కరోనా సవాల్​ను భారత్​ ఎదుర్కొనే దారేది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.