స్టాక్ మార్కెట్లను ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వారం ద్రవ్యోల్బణం, ఎగుమతి దిగుమతుల గణాంకాలు విడుదల కానున్నాయి. దేశీయంగా ఈ గణాంకాలపైనే మదుపరులు ఎక్కువగా దృష్టి సారించే అవకాశముందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
అంతర్జాతీయంగా చూస్తే.. బ్రెగ్జిట్ ఒప్పందం అప్డేట్లు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, ఇతర ఆర్థిక అంశాలపై చేసే ప్రకటనలు మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ అధిపతి (రీసెర్చ్) వినోద్ నాయర్ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ ప్రకటనలు, వృద్ధి రేటు రికవరీపై సానుకూల అంచనాల నేపథ్యంలో.. ఈ వారం కూడా మార్కెట్లు ఇంకా ముందుకే సాగొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ అధిపతి (రిటైల్ రీసెర్చ్) సిద్ధార్థ్ ఖింకా తెలిపారు. అయితే అంతర్జాతీయ పరిణామాల వల్ల కొంత ఒడుదొడుకులకు అవకాశం లేకపోలేదని వివరించారు.
వీటన్నింటితో పాటు ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:స్టాక్ మార్కెట్లోకి నీరు!!