ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) ఈ మార్చి త్రైమాసికం నుంచి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆరేడు నెలలుగా మొండి బాకీల వసూలుకు, వ్యాపారాభివృద్ధికి తాము తీసుకున్న చర్యల ఫలితంగా లాభాల్లోకి వచ్చే సానుకూలత కనిపిస్తోందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈఓ కరణం శేఖర్ చెప్పారు. ఆర్బీఐ నిర్దేశించిన పీసీఏ (సత్వర దిద్దుబాటు చర్యల) నుంచి బ్యాంకు బయటకు రావచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ‘ఈనాడు’ తో మాట్లాడారు. బ్యాంకు స్థితిగతులు, రుణాల్లో వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
దిద్దుబాటు చర్యలపై దృష్టి
ఐఓబీ మూడేళ్లుగా నష్టాల్లోనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి రూ.2,253 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. రానిబాకీలకు పెద్దఎత్తున కేటాయింపులు చేయడం దీనికొక ప్రధాన కారణం. ఆర్బీఐ నిర్దేశించిన పీసీఏ ఫ్రేమ్వర్క్ జాబితాలోనూ బ్యాంకు ఉంది. దీన్నుంచి బయట పడటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు శేఖర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకునకు గత ఏడాది సెప్టెంబరులో రూ.3,800 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. మరో రూ.4,630 కోట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో మూలధన నిష్పత్తి సానుకూలంగా మారి 11.36 శాతానికి చేరింది. మొండి బాకీల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినందున నికర నిరర్ధక ఆస్తులు కూడా తగ్గుముఖం పట్టాయి.ఈ బ్యాంకుకు ‘లెవరేజీ’ సమస్య లేదు. ఇక మిగిలింది లాభాల్లోకి రావటమే. మార్చి త్రైమాసికానికి లాభాల్లోకి వస్తామని ఆశిస్తున్నట్లు, ఆ తర్వాత పీసీఏ ఫ్రేమ్వర్క్ నుంచి కూడా బయటకు రావచ్చని ఆయన తెలిపారు.
ప్రత్యేకంగా ‘రికవరీ’ శాఖలు!
మొండి బాకీలను వసూలు చేయటం కోసం ప్రత్యేకంగా 16 శాఖలను ఏర్పాటు చేసి, ఎంపిక చేసిన సిబ్బందిని నియమించడంతో సత్ఫలితాలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు త్రైమాసికానికే వసూళ్లు పెరిగినట్లు, డిసెంబరు త్రైమాసికానికి ఇంకా అధికంగా వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. రూ.5 కోట్ల వరకూ ఉన్న బకాయిలను ‘ప్రత్యేక ఓటీఎస్’ కింద పరిష్కరించుకునే పధకాన్ని కొంతకాలంగా బ్యాంకు అమలు చేస్తున్నట్లు, ఈ పధకం పరిమితిని డైరెక్టర్ల బోర్డు అనుమతితో పెంచినట్లు, తద్వారా ఎక్కువ మొత్తాలను రికవరీ చేసేందుకు వీలుకలిగిందని చెప్పారు రానిబాకీల ఖాతాలకు సంబంధించి తనఖా కింద దాదాపు 8,000 ఆస్తులు ఉన్నాయని, వాటిని దశల వారీగా వేలం వేసేందుకు సిద్ధపడుతున్నాయని తెలిపారు. మరో నెలరోజుల్లో ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ చర్యల వల్ల నికరర నిరర్ధక ఆస్తులు 6 శాతం కంటే దిగువకు తగ్గే అవకాశం ఉందని వివరించారు.
లాభాలు కొనసాగిస్తాం...
ఈ త్రైమాసికం తర్వాతా క్రమం తప్పకుండా లాభాలు ఆర్జించాల్సిన సవాలు ఎదురవుతుందని శేఖర్ విశ్లేషించారు. దీని కోసం ఇప్పటికే ప్రొవిజనింగ్ చేసిన ఖాతాల నుంచి వసూళ్లు పెంచుకోవలసి ఉందని, రుణాల్లో అధిక వృద్ధి సాధించాలని అన్నారు. స్థూల నిరర్ధక ఆస్తుల్లో దాదాపు రూ.10,000 కోట్ల సొమ్ము రావలసిన ఖాతాలకు ఇప్పటికే నూరుశాతం ‘ప్రొవిజనింగ్’ చేశారు. ఈ ఖాతాల నుంచి ఒక్కో త్రైమాసికంలో మేం ఎంత మొత్తం వసూలు చేయగలిగితే, ఆ త్రైమాసికంలో ఆ మొత్తం లాభాలకు జతకలుస్తుందన్నారు.
కార్పొరేట్ రుణాలు తగ్గించాం
రిటైల్ విభాగంలో గృహ, బంగారం తనఖా రుణాలు అధికంగా ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నామని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకూ రుణాల జారీ పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంఎస్ఎంఈ రుణాలు ఇవ్వటంలో తమకు ఎంతో అనుభవం ఉందని, ఈ విభాగంపై ఇంకా దృష్టి కేంద్రీకరిస్తున్నామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కార్పొరేట్ రుణాలపై దృష్టి తగ్గించినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రుణాలు అధికంగా ఇవ్వటం కోసం 200 శాఖలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
బ్యాంకుల విలీనాలు మంచికే...
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో మంచి ఫలితాలే వస్తాయని, పెద్ద బ్యాంకులు మొండిబాకీల సమస్యను సమర్థంగా తట్టుకోగలుగుతాయని చెప్పారు. ప్రస్తుతానికి తమకు తగినంత మూలధనం ఉన్నటు చెప్పారు. తమ వ్యాపారం ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఉందన్నారు.
ఇదీ చూడండి: రెడ్మీ 8కి పోటీగా రియల్మీ 5ఐ- నేడే లాంఛ్