ETV Bharat / bharat

వైఎస్సార్సీపీలో చిచ్చురేపుతున్న నియోజకవర్గాల బాధ్యుల మార్పు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 6:41 AM IST

YSRCP Politics in AP: వైఎస్సార్సీపీలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు చిచ్చురేపుతోంది. తమ స్థానాల్లో కొత్త వ్యక్తులను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేడో రేపో కొత్త సమన్వయ కర్తల జాబితా విడుదలకు జగన్‌ సిద్ధమవుతున్నారు.

YSRCP_Politics_in_AP
YSRCP_Politics_in_AP

YSRCP Politics in AP: వైఎస్సార్సీపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం ఆయనను అక్కడి నుంచే పోటీచేయాలని, ఎవరి నుంచీ సమస్యలు ఉండవని చెప్పినట్లు సమాచారం. మంత్రి ఉష శ్రీచరణ్‌ తాను ఈసారి పెనుకొండ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కల్యాణదుర్గం నుంచి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను బరిలోకి దించే అవకాశం ఉంది.

రెండు మూడు రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్తున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసేందుకు తనకు సీఎం అవకాశమిచ్చారని విలేకరులకు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ టికెట్‌ మరో బీసీకి ఇవ్వచ్చని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణుల్లో ఒకరికి ఈసారి అవకాశం లేనట్లేనని తెలిసింది. ఈ రెండు సీట్లలో ఒకటి ఒక విద్యాసంస్థ యజమాని అయిన ముస్లింకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో తుపాను - 'టికెట్ రాకున్నా హ్యాపీ - ఓడిపోవడం కంటే అదే బెటర్'

గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడును నిలబెట్టనన్నట్లు సమాచారం. గురువారమే రాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్దలూరు వెళ్లాలనుకున్నా జగన్‌ ఆయనను ఒంగోలు నుంచే మళ్లీ పోటీచేయాలని స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి విషయంలో చర్చ జరిగినా ఆయనకు సీఎం ఎలాంటి భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది.

మాజీ మంత్రి పేర్ని నాని, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ సీఎం కార్యాలయానికి వచ్చి పార్టీ ముఖ్యనేతలతోపాటు సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి వెళ్లారు. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా బళ్లారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో మాధవ్‌ను మారుస్తారా, ఈసారి పూర్తిగా పక్కన పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు నియోజకవర్గాల మార్పు వైఎస్సార్సీపీలో అలజడి రేపుతోంది. పెనుకొండ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా మంత్రి ఉష శ్రీచరణ్‌ను పంపడంపై ఎమ్మెల్యే శంకరనారాయణ వర్గం మండిపడుతోంది. శంకరనారాయణనే కొనసాగించాలంటూ రొద్దం మండల ఎమ్​పీపీ చంద్రశేఖర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశమయ్యారు. మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని మార్పులు ఖాయమంటున్న వైసీపీ అధిష్ఠానం - తాడేపల్లిలో చర్చోపచర్చలు

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ బాధ్యతలు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మక్బూల్ అహమ్మద్‌కు అప్పగించే అవకాశముందని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి అధిష్టానం సమాచారమిచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వర్గీయులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, ఆరుగురు ఎంపీపీలు రాజీనామా చేస్తామని ప్రకటించారు. పార్టీ పెద్దలు నిర్ణయాన్ని మార్చుకుని సిద్ధారెడ్డికే కదిరి టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిక్కెట్ మంత్రి అంబటి రాంబాబుకు ఇవ్వొద్దంటూ పార్టీ నాయకులు తాడేపల్లిలోని విజయసాయిరెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపారు. దాదాపు 50 మంది సర్పంచులు, ఎంపీటీసీలు అంబటికి కాకుండా సత్తెనపల్లి సీటు ఎవరికిచ్చినా కలసికట్టుగా పనిచేస్తామని విజయసాయిరెడ్డికి చెప్పారు. గడప గడప కార్యక్రమంలోనూ తమను బలవంతంగా ఇంట్లోనే గృహనిర్బంధం చేసి అంబటి ఇబ్బందులకు గురిచేశారని వారు వాపోయారు.

ఇవేమీ పట్టుంచుకోని జగన్ ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కడప జిల్లాల సమన్వయకర్తల పేర్లను నేడో, రేపో వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒకటి రెండు స్థానాల చొప్పున మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

పార్టీ విధానాలు నచ్చనివారు బయటకు పోతుంటారు- అలాంటివారు ఉంటే పార్టీకి ఇంకా నష్టం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.