ETV Bharat / bharat

viveka case: 'రక్తచరిత్ర'కు.. మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం..?

author img

By

Published : Apr 17, 2023, 11:52 AM IST

YS Vivekananda
YS Vivekananda

YS Vivekananda Reddy murder case updated news: 2019వ సంవత్సరం మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై ఆనాడు తొలుత గుండెపోటు అన్నారు. ఆ తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారు. అంతలో కాదుకాదు.. వివేకాను చంద్రబాబే చంపించారన్నారని జగన్‌ వాపోయారు. 'నారాసుర రక్తచరిత్ర' పేరుతో తీవ్ర ప్రచారం చేశారు. సీబీఐ దర్యాప్తుతో ఇప్పుడు 'నారాసుర రక్తచరిత్ర'కు మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎవరు..? అనే చర్చ రాష్ట్రంలో దుమారం రేపుతోంది.

'రక్తచరిత్ర'కు.. మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం..?

YS Vivekananda Reddy murder case updated news: తొలుత గుండెపోటు అన్నారు. ఆ తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారు. ఇంతలో కాదుకాదు.. మా చిన్నాన్నను చంద్రబాబే చంపించారన్నారని జగన్‌ వాపోయారు. ఆ తర్వాతి రోజే 'నారాసుర రక్తచరిత్ర' పేరుతో.. సాక్షిలో నిలువెత్తు ప్రచారం చేశారు. నిజాలు తేలాలంటే సీబీఐ విచారణ చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసి.. అధికారంలోకి రాగానే అవసరం లేదంటూ ఉపసంహరించారు. అవినాశ్​రెడ్డిపై ఆరోపణలు రాగానే.. ఓ కన్ను ఇంకో కన్నుని పొడుచుకుంటుందా? అంటూ డైలాగులు కొట్టారు. న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతా రెడ్డిపైనే ఆరోపణలు చేశారు. ఇంతకీ వివేకా రక్తచరిత్ర రాసిందెవరు..?. అయితే, వివేకా హత్యకు గురైన రోజున ఎవరెవరు ఏం మట్లాడారు..?, తెలుగుదేశం పార్టీపై ఏయే ఆరోపణలు చేశారు..?, అనే తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తే.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2019 మార్చి 15వ తేదీన ఉదయం వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెలుగు చూశాక.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తొలుత మీడియాతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమన్నారు. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా ప్రజా జీవితానికి అంకితమైన అయన.. గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరం అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అనంతరం 2019 మార్చి 15 అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆయన.. వివేకానంద రెడ్డి హత్యలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రమేయం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెలుగుదేశం కుట్రలు పన్నుతోందన్నారు. ఈ హత్యకు చంద్రబాబు, లోకేశ్‌ సూత్రధారులైతే.. ఆదినారాయణరెడ్డి కుట్రను అమలు చేశారని ఆరోపించారు.

2019 మార్చి 15వ తేదీన వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి మరణంపై పూర్తిస్థాయిలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మొదట రక్తపు వాంతులు అయ్యాయేమో అని అనుకున్నామని.. తర్వాత రక్తపు వాంతులు కాదని అనిపించిందని చెప్పారు. ఆయన తలపై పెద్ద గాయాలు రెండు ఉన్నాయని.. ముందు నుంచి ఒకటి, వెనుకవైపు మరింత పెద్దగాయం ఉందన్నారు. వేళ్లకు, ముఖంపై గాయాలు ఉన్నాయని.. ఇవన్నీ చూస్తే ఆయన మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని.. ఇందులో కుట్ర కోణాన్ని బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో 2019 మార్చి 15 తేదీన బాబాయి మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన జగన్‌.. వివేకా మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విచారణను తప్పుదోవ పట్టిస్తోందని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇదే అంశంపై హైదరాబాద్‌లో అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన జగన్ మాట్లాడారు. అనంతరం మీడియా మాట్లాడిన జగన్‌.. చంద్రబాబే తన బాబాయిని చంపించారని ఆరోపించారు. ఆ వెంటనే 2019 మార్చి 19న హైకోర్టులో జగన్ పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు, చంద్రబాబుతో ప్రమేయం లేని నిష్పక్షపాత దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక.. 2020 ఫిబ్రవరి 6న సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ అంతకుముందు వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

మరోవైపు 2021 నవంబరు 19న అసెంబ్లీలో మాట్లాడిన జగన్‌.. ఓ కన్నుని మరో కన్ను పొడుచుకుంటుందా అంటూ కన్ను సిద్ధాంతం చెప్పారు. 2023, మార్చి 12 హత్య కేసులో విచారణకు రావాలంటూ ఇటీవల సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడు అవినాశ్‌ రెడ్డి మాట్లాడుతూ..తన తండ్రి భాస్కర్‌రెడ్డి, తాము అన్నింటికీ సిద్ధమై ఉన్నామని చెప్పారు. ఇలా ఇన్ని రకాలుగా మాటలు మారుస్తూ, ఆరోపణలపై ప్రత్యారోపణలు చేస్తూ.. చిన్నాన్నను చంపిన నిందితులను మాత్రం సీఎం జగన్‌ పట్టుకోలేకపోయారు. 2021 నవంబరు 19వ రోజున ''వై.ఎస్‌. వివేకానంద రెడ్డి నాకు చిన్నాన్న, మా నాన్న సొంత తమ్ముడు. అవినాష్‌రెడ్డి నా మరో చిన్నాన్న కొడుకు. ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది..? ఎందుకు చేస్తారు అధ్యక్షా..? మా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే, వాళ్లే (టీడీపీ) చేసి ఉండాలి. కానీ, వక్రీకరించి మా కుటుంబంలోనే చిచ్చుపెడుతున్నారు. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడితే ఒక్కోసారి బాధేస్తుంది. దురదృష్టకరం.'' అని జగన్ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.