ETV Bharat / bharat

'విజయం పక్కా మాదే- యోగికి ఇంటిదారి చూపిస్తాం'

author img

By

Published : Feb 15, 2022, 7:35 AM IST

Akhilesh yadav interview with EENADU
Akhilesh yadav interview with EENADU

Akhilesh yadav Interview: ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) సహా పలు చిన్న పార్టీలతో కలిసి ఆయన ఏర్పాటుచేసిన కూటమికి ప్రచారపర్వంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు కనిపిస్తోంది. బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌తో నెలకొన్న విభేదాలు సమసిపోవడంతో.. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే పార్టీపై ప్రస్తుతం అఖిలేశ్‌కు పూర్తిస్థాయిలో పట్టు చిక్కడమూ కలిసొచ్చే అంశమే. తాజా ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధిస్తుందని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఇంటిదారి చూపిస్తామని ఆయన సంపూర్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఈనాడు'తో ముఖాముఖిలో అఖిలేశ్‌ పలు అంశాలపై స్పందించారు. విశేషాలివీ..

Akhilesh yadav Interview: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్​​ యాదవ్​. సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఇంటిదారి చూపిస్తామని అంటున్నారు. పెద్ద పార్టీలతో గతంలో పొత్తులు కలిసిరాలేదని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కులగణన నిర్వహిస్తామని 'ఈనాడు' ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే?

ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలను ‘80% వర్సెస్‌ 20%’గా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అభివర్ణించారు. హిందువులు, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించేందుకే అలా వ్యాఖ్యానించినట్లు విశ్లేషణలున్నాయి. దీనిపై మీ అభిప్రాయమేంటి?

అఖిలేశ్‌: సమాజంలోని అన్ని వర్గాలను మా పార్టీ సమానంగా ఆదరిస్తుంది. భాజపా వైఖరి అందుకు పూర్తి భిన్నం. ఓబీసీలు, దళితులు, మైనారిటీలపై ఆ పార్టీ వివక్ష చూపుతుంటుంది. ఈ ఎన్నికలను ‘80% వర్సెస్‌ 20%’గా అభివర్ణించడం ద్వారా.. భాజపాకు రాష్ట్రంలో కేవలం 20% సీట్లే రాబోతున్నాయని, 80% స్థానాలను ఎస్పీ గెల్చుకుంటుందని యోగి అంగీకరించినట్లయింది.

యోగి కేబినెట్‌లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల నుంచి పలువురు మంత్రులున్నారు. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గంలోకి యూపీ నుంచి ఏడుగురు నేతలను తీసుకోగా.. వారిలో ఆరుగురు ఈబీసీ, దళిత సామాజికవర్గాలకు చెందినవారే. అలాంటప్పుడు కమలదళం వివక్ష చూపుతోందని ఎలా అంటారు?

వారు పేరుకు మాత్రమే వెనుకబడిన తరగతుల నేతలు. వారు నిజంగా ఆ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లయితే.. కులగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించడం లేదు? వాస్తవమేంటంటే.. భాజపాలో ఏ సామాజికవర్గానికీ విలువ లేదు.

కులగణన కోసం వినిపిస్తున్న డిమాండ్‌పై మీ స్పందన?

మేం అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో కులగణన నిర్వహిస్తాం. ఓబీసీ కులాలవారు తమ సామాజికవర్గ జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు అది దోహదపడుతుంది. దళితులు, మైనారిటీలకూ అది ప్రయోజనకరమే.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ జట్టు కట్టాయి. ఇప్పుడెందుకు కలిసి పోటీ చేయట్లేదు?

మళ్లీ కలిసి బరిలో దిగాలనే మా పార్టీ భావించింది. కానీ- రాజకీయపరమైన కొన్ని కారణాల వల్ల బీఎస్పీ అధినాయకురాలు మాయావతి అందుకు అంగీకరించలేదు.

పశ్చిమ యూపీలో 40 చోట్ల బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను పోటీకి దించింది. ఆ వర్గం ఓట్లను చీల్చేందుకే అలా చేశారని భావిస్తున్నారా?

భాజపా, బీఎస్పీ పరస్పర అవగాహన ప్రకారం ముందుకు సాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం! పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఇలాంటి కుట్రను అమలు చేశాయి. ఇప్పుడూ అదే బాటలో నడుస్తున్నాయి. అయితే ప్రజలు తెలివైనవాళ్లు. బీఎస్పీ ఎజెండా ఏంటో వారికి బాగా తెలుసు.

ఎన్నికలు పూర్తయ్యాక మిత్రపక్షాలను మార్చే అలవాటు ఆర్‌ఎల్‌డీకి ఉంది. ఫలితాల తర్వాత ఆ పార్టీ మీతో కలిసి ఉంటుందని నమ్మకముందా?

భాజపాతో పొత్తు పెట్టుకోవాలని ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్‌ చౌధరీని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బహిరంగంగా ఆహ్వానించారు. అయినా జయంత్‌ అందుకు అంగీకరించలేదు. ఆయన మాతోనే ఉంటారని విశ్వాసముంది.

Akhilesh yadav interview with EENADU
సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​

వివాదాస్పద సాగుచట్టాలను కేంద్రం రద్దు చేసినా.. ప్రచారంలో మీరెందుకు ఆ చట్టాల గురించి పదేపదే మాట్లాడుతున్నారు?

సాగుచట్టాలపై ఆందోళన సాగినన్నాళ్లు భాజపా నేతలను రైతులు చాలా గ్రామాల్లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. పరిస్థితులు విషమించడం చూసి ఆ చట్టాలను కేంద్రం రద్దు చేసింది. అయితే ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ వాటిని తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

మీ కూటమి సొంతంగా మెజార్టీ స్థానాలు సాధించలేకపోతే.. భాజపాను గద్దె దించేందుకు బీఎస్పీతో జట్టు కట్టే అవకాశాలుఉన్నాయా?

మా కూటమి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామన్న సంపూర్ణ ధీమా ఉంది.

మీరు, శివపాల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉంది. ఎన్నికల తర్వాత ఎస్పీ, కాంగ్రెస్‌ చేతులు కలిపే అవకాశాలున్నాయని చెప్పేందుకు ఇది సంకేతమా?

మేమిద్దరం బరిలో ఉన్న సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనందుకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రాకు ధన్యవాదాలు. కానీ- పెద్ద పార్టీలతో జట్టు కట్టినప్పుడు మాకు ఎదురైన అనుభవాలు ప్రోత్సాహకరంగా లేవు. వాటితో చేతులు కలిపినప్పుడు మాకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. అందుకే ఈ దఫా చిన్న పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుచేశాం. మా కూటమి కచ్చితంగా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది.

ఎస్పీ బంధుప్రీతి ఉన్న పార్టీ అని భాజపా ఆరోపిస్తోంది?

మాకు కుటుంబాలు ఉన్నందుకు మేం గర్వపడుతున్నాం. కుటుంబాన్ని కలిగిఉన్నవారే కుటుంబసభ్యుల బాధను అర్థం చేసుకోగలరు. యూపీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రికి కుటుంబం లేదు. ఒకవేళ ఉండి ఉంటే.. లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకు చేరుకునేందుకు అనేక మైళ్ల దూరం నడిచివెళ్లిన కార్మికుల కష్టాలు ఆయనకు అర్థమయ్యేవి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే భాజపా బంధుప్రీతి వంటి తప్పుడు ఆరోపణలు గుప్పిస్తోంది.

రాష్ట్రంలో గూండాలు, మాఫియా శక్తులపై యోగి సర్కారు ఉక్కుపాదం మోపిన తీరుపై సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు?

అదంతా అబద్ధం. గత ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు వేగంగా క్షీణించాయి. ఎంపిక చేసుకున్న కొందరు నేరగాళ్లపైనే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సామాజికవర్గాల ప్రాతిపదికన వారిని లక్ష్యంగా చేసుకుంది. దీన్ని సామాన్యులు ఏమాత్రం హర్షించడం లేదు.

మీకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఎస్పీ గెలిస్తే.. కేంద్రంలో తృతీయ కూటమి దిశగా అడుగులు పడతాయా?

మా పార్టీకి మద్దతు పలుకుతూ ఇతర లౌకికవాద నేతలూ రాష్ట్రానికి రానున్నారు. వారి మద్దతు మాకు దక్కుతుండటం.. తొలుత యూపీలో, ఆపై 2024 సార్వత్రిక ఎన్నికలతో కేంద్రంలో భాజపాను గద్దె దింపాలని దేశవ్యాప్తంగా ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పేందుకు నిదర్శనం.

ఇవీ చూడండి: యూపీలో సంకీర్ణం తప్పదా? తొలి దశ పోలింగ్ ఏం చెబుతోంది?

'కాంగ్రెస్‌ను ఫినిష్ చేయడానికి.. రాహుల్‌, ప్రియాంక చాలు!'

పంజాబ్ టూర్​లో మోదీకి మరో చేదు అనుభవం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.