ETV Bharat / bharat

'పిల్లలకు కరోనా టీకా- ఈ విషయం మరవొద్దు'

author img

By

Published : Jan 2, 2022, 5:29 PM IST

Updated : Jan 2, 2022, 7:04 PM IST

Vaccination Children
Vaccination Children

Vaccination Children: 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సిన్​ మిక్సింగ్​ గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు.. ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

Vaccination Children: దేశవ్యాప్తంగా సోమవారం 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో.. చిన్నారుల వ్యాక్సినేషన్​ ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వర్చువల్​గా మాట్లాడారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్​ మాండవీయ. 15-18 ఏళ్ల వయస్సు వారికోసం ప్రత్యేక వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

టీకాలు మిక్సింగ్​ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒమిక్రాన్​ వేరియంట్​ విస్తరిస్తున్న నేపథ్యంలో.. తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.

ప్రస్తుతం 15-18 ఏళ్ల వయస్సు వారికి కొవాగ్జిన్​ టీకా మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్లో ఇది స్పష్టంగా ఉంది. మరోవైపు.. దేశంలో వయోజనులకు కొవాగ్జిన్​తో పాటు కొవిషీల్డ్​, స్పుత్నిక్​ వీ టీకాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్​ పంపిణీ విషయంలో గందరగోళం తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొన్నారు మాండవీయ.

''టీకాల పంపిణీ సమయంలో వేర్వేరు వ్యాక్సిన్లు కలవకుండా ఉండేందుకు.. ప్రత్యేక కొవిడ్​ వ్యాక్సినేషన్​ కేంద్రాలు(సీవీసీ), ప్రత్యేక సెషన్​ సైట్లు, ప్రత్యేక క్యూలైన్లు(ఒకవేళ అదే కేంద్రంలో వయోజనులకు వ్యాక్సినేషన్​ నిర్వహిస్తే) ఏర్పాటు చేయాలి. వ్యాక్సినేషన్​ బృందాలను కూడా వేర్వేరుగా నియమించాలి.''

- మన్సుఖ్​ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

అన్ని రాష్ట్రాలు తమ వద్ద అందుబాటులో ఉన్న టీకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కో-విన్​ యాప్​లో అప్​డేట్​ చేస్తుండటం ద్వారా.. వ్యాక్సిన్​ పంపిణీ సులభతరం అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఒమిక్రాన్​ కట్టడిపై దిశానిర్దేశం

దేశంలో కరోనా ఒమిక్రాన్​ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో వైరస్​ కట్టడికి అవగాహన కల్పించేలా వెబినార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దిల్లీ ఎయిమ్స్​ సహకారంతో కొవిడ్​ కేసుల క్లినికల్​ మేనేజ్​మెంట్​ అంశాలపై జనవరి 5 నుంచి 19 మధ్య వెబినార్లను నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్​-19 ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కొవిడ్​-19 చికిత్స కేంద్రాల ఇన్​ఛార్జిలు, సీడీఎంఓలు వెబినార్లకు హాజరుకావాలని ఆయన అభ్యర్థించారు.

India's Covid vaccination programme:

భారత్​లో కొవిడ్ వ్యాక్సినేషన్​​.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన, పెద్దదైన టీకా పంపిణీ కార్యక్రమాల్లో ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్​-19 టీకా పంపిణీలో భారత్​ లక్ష్యాలను అందుకోలేదని కొన్ని మీడియాలు తప్పుడు వార్తలు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాయని, వాటిని నమ్మొద్దని పేర్కొంది.

గతేడాది జనవరి 16న వ్యాక్సినేషన్​ ప్రారంభమైనప్పటి నుంచి భారత్​ ఎన్నో మైలురాళ్లను అధిగమించినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

  • అన్ని దేశాలకంటే ముందే.. 9 నెలల వ్యవధిలోనే భారత్​లో 100 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగిందని ఉద్ఘాటించింది.
  • ఒక్కరోజు అత్యధికంగా 2.51 కోట్ల డోసులు అందించామని, చాలా సార్లు రోజుకు కోటికిపైగా వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్లు పేర్కొంది.

టీకా మొదటి డోసు పంపిణీలో అర్హులైన వారిలో 90 శాతం మందికి భారత్​లో వ్యాక్సిన్​ ఇచ్చినట్లు తెలిపిన కేంద్రం.. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందంజలో ఉందని వివరించింది. ఈ జాబితాలో అమెరికా 73.2 శాతం, బ్రిటన్​ 75 శాతం, ఫ్రాన్స్​ 78 శాతం, స్పెయిన్​ 84 శాతంతోనే ఉన్నాయని గుర్తుచేసింది.

భారత్​లో 65 శాతం మందికిపైగా టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వెల్లడించింది.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు ఆదివారం భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 27,553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,249 మంది కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2 వేలకు చేరువ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇవీ చూడండి: దిల్లీ, మహారాష్ట్రలో కరోనా విలయం- రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 27,553 మందికి వైరస్​

Last Updated :Jan 2, 2022, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.