ETV Bharat / bharat

'ఉపహార్'​ కేసులో సుశీల్​, గోపాల్​కు ఏడేళ్ల జైలు

author img

By

Published : Nov 8, 2021, 4:20 PM IST

Uphaar fire tragedy: Delhi court awards 7-yr jail terms to Sushil & Gopal Ansal in evidence tampering case
'ఉపహార్'​ అగ్నిప్రమాదం కేసులో సుశీల్​, గోపాల్ అన్సాల్​కు ఏడేళ్ల జైలు

59 మందిని బలిగొన్న ఉపహార్ థియేటర్ ఘోర​ అగ్నిప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన సుశీల్, గోపాల్​ అన్సాల్​కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఇద్దరికీ చెరో రూ.2.25కోట్లు జరిమానా విధించింది.

రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజాలు సుశీల్​ అన్సాల్​, గోపాల్ అన్సాల్​​కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది దిల్లీ కోర్టు. 1997లో 59మంది ప్రాణాలను బలిగొన్న ఉపహార్ థియేటర్ ఘోర అగ్నిప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు ఈ శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికీ చెరో రూ.2.25కోట్ల జరిమానా కూడా విధించింది. చీఫ్​ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్​ పంకజ్ శర్మ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఎన్నో రాత్రులు ఆలోచించిన తర్వాత వీరికి ఈ శిక్షే సరైనది భావించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సహకరించిన కోర్టు మాజీ సిబ్బంది పీపీ బత్రా, అనూప్ సింగ్​కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. చెరో రూ.3లక్షల జరిమానా విధించింది.

బెయిల్​పై ఉన్న సుశీల్​, గోపాల్ అన్సాల్​ను కోర్టు ఆదేశాలతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

1997 జూన్​ 13న ఉపహార్ సినిమా థియేటర్​లో 'బోర్డర్' సినిమా ప్రదర్శిస్తుండగా ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో 59మంది మరణించారు.

ఈ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే సుశీల్, గోపాల్​ అన్సాల్​ను దోషులుగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరికీ చెరో రూ.30కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని దిల్లీలో ట్రామా సెంటర్ నిర్మాణానికి ఉపయోగించాలని సూచించింది.

ఇదీ చదవండి: ఆ మహిళలకు మౌలిక సదుపాయాలపై కేంద్రానికి నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.