ETV Bharat / bharat

TSPSC Paper Leak Updates : వారందరినీ డీబార్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

author img

By

Published : May 30, 2023, 5:50 PM IST

Updated : May 30, 2023, 7:38 PM IST

TSPSC
TSPSC

17:21 May 30

TSPSC Paper Leak Updates : ప్రశ్నపత్రాల లీక్‌ కేసు నిందితులను డీబార్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

TSPSC Paper Leak Updates : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రమేయమున్న వారిని డీబార్‌ చేయాలని నిర్ణయించింది. కేసులో అరెస్టు అయిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని కమిషన్‌ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్‌పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. లేనట్లయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది.

అరెస్టులు పెరిగే అవకాశం.. : ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్పటి వరకు 44 మందిపై కేసు నమోదు చేయగా.. 43 మందిని అరెస్టు చేసింది. ప్రతిపాదిత 37 మంది పేర్లను వెబ్​సైట్‌లో కమిషన్ వెల్లడించింది. మరోవైపు సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కాగా.. ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

తాజాగా నిన్న జరిగిన సిట్ దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాసిన అభ్యరులకు పరీక్ష హాలులోకి సమాధానాలు చేరవేసినట్టు... సిట్‌ గుర్తించింది. అందుకు ఒక ఎగ్జామినర్ సహకరించినట్లు తేలింది. టీఎస్​ఎస్పీడీసీఎల్​ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌ ద్వారా డీఈ రమేశ్‌... కొన్ని ప్రశ్నపత్రాలు తీసుకొని అమ్మినట్లు తెలుస్తోంది. మరికొందరి కోసం ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలు సేకరించేందుకు... రమేష్ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో రమేశ్‌ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమాధానాలు చేరవేసేలా.. ఏడుగురితో ఒక్కొక్కరి నుంచి రూ.20-30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందు మైక్రోఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు వారికిచ్చాడు. అభ్యర్థులు వాటిని బెల్టులో భద్రపర్చుకొని.. పరీక్ష హాలులోకి చేరారు.

ఎగ్జామినర్‌ సాయంతో ప్రశ్నపత్రాల ఫొటోలు తీసి.. రమేశ్‌ వాట్సాప్‌ నెంబర్‌కు చేరవేశారు. చాట్‌జీపీటీ ద్వారా రమేశ్‌... వాటికి అనువైన సమాధానాలు సేకరించి వాట్సాప్‌ ఫోన్‌కాల్‌ ద్వారా పరీక్ష హాలులోని.. ఏడుగురు అభ్యర్థులకు చేరవేశాడు. ఈ వ్యవహారంలో... డీఈ రమేష్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్, నరేష్, మహేశ్, శ్రీనివాస్​లను అధికారులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు.. లీకేజీపై సిట్ తుది నివేదిక వచ్చిన తర్వాతే... పరీక్షలు పూర్తైన 3 ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల చేయాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు వేచిచూడాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది.

ఇవీ చదవండి :

Last Updated :May 30, 2023, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.