ETV Bharat / bharat

షాహీ ఈద్గా మసీదు సర్వేకు హైకోర్టు ఓకే- హిందూ పక్షం పిటిషన్​కు అనుమతి

author img

By PTI

Published : Dec 15, 2023, 8:00 AM IST

Updated : Dec 15, 2023, 9:06 AM IST

Mathura Shahi Idgah Survey : మథురలోని షాహీ ఈద్గా మసీదు సర్వేకు కోర్టు కమిషనర్​ను నియమిస్తామని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. శ్రీకృష్ణుడి మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారని, సర్వే చేస్తే నిజాలు బయటకు వస్తాయని హిందూ పక్షం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అనుమతించింది.

mathura-shahi-idgah-survey-allahabad-high
mathura-shahi-idgah-survey-allahabad-high

Mathura Shahi Idgah Survey Allahabad High Court : ఉత్తర్​ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు కేసులో కీలక పరిణామం జరిగింది. మసీదును సర్వే చేసేందుకు కోర్టు కమిషనర్​ను నియమిస్తామని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇందుకోసం విధి విధానాలను ఈ నెల 18న ఖరారు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔరంగజేబ్ పాలనలో శ్రీకృష్ణుడి మందిరాన్ని కూల్చి, షాహీ ఈద్గాను నిర్మించారని, మసీదులో సర్వే చేపడితే నిజాలు బయటకు వస్తాయని హిందూ పక్షం దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు అనుమతించింది. ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన వ్యాజ్యానికి అనుబంధంగా ఈ వ్యాజ్యం దాఖలైంది.

'మసీదుకు నష్టం కలిగించొద్దు'
సర్వే నిర్వహించే సమయంలో మసీదుకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని కోర్టు స్పష్టం చేసింది. అక్కడి పవిత్రతకు భంగం కలిగించకూడదని పేర్కొంది. ఈ పిటిషన్​ను ఏడుగురు భక్తులు దాఖలు చేశారు. శ్రీకృష్ణుడిని సైతం పిటిషనర్​గా పేర్కొన్నారు. మసీదు కింద శ్రీకృష్ణుడి జన్మ స్థానం ఉందని వ్యాజ్యంలో వివరించారు. అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని కూల్చివేసి షాహీ ఈద్గా నిర్మించారని చెప్పడానికి పలు ఆధారాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టుకు షాహీ ఈద్గా మేనేజ్​మెంట్
హిందువుల తరఫున న్యాయవాదులు హరిశంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్, ప్రభాస్ పాండే, దేవకీ నందన్ వాదనలు వినిపించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, షాహీ ఈద్గా మేనేజ్​మెంట్ కమిటీ ఈ తీర్పుపై విస్మయం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపింది.

మందిర్- మసీదు వివాదంలో కోర్టులు సర్వేకు ఆదేశించడం ఈ మధ్య కాలంలో ఇది రెండో సారి. గతంలో వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు కేసులో సైతం స్థానిక న్యాయస్థానం సర్వేకు ఆదేశించింది. ఆ సర్వేలో 300కు పైగా ఆధారాలను ఏఎస్ఐ అధికారులు సేకరించారు. ఏళ్ల నాటి బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, కిటికీలు, తలుపులు, కళాఖండాల గుర్తులు తదితర వస్తువులను ట్రెజరీలో నిక్షిప్తం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి.

'కృష్ణుడి జన్మస్థలిలో మసీదు నిర్మాణం'.. మథుర కోర్టు కీలక ఆదేశాలు

'ఆ మసీదుకు మరోచోట రెట్టింపు స్థలం'

Last Updated : Dec 15, 2023, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.