ETV Bharat / bharat

కేంద్రానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదు: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Mar 8, 2023, 11:11 AM IST

Updated : Mar 9, 2023, 6:25 AM IST

Kavitha Response To ED Notices In Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా కార్యక్రమం ఉందని.. అందువల్ల విచారణకు హాజరయ్యే తేదీలపై న్యాయ సలహా తీసుకుంటానని కవిత తెలిపారు. మరోవైపు కేంద్రంలో ఉన్న ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి కేసీఆర్, బీఆర్ఎస్, తెలంగాణ సమాజం ఎన్నటికీ తలవంచదని ట్వీట్ చేశారు.

Kavitha
Kavitha

Kavitha Response To ED Notices In Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్​ స్కాంలో ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గతంలో సీబీఐ తనను ఏడు గంటలు విచారించింది. తాజాగా ఈ నెల 9వతేదీన విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై కవిత వివరణ ఇచ్చారు. ఈడీ విచారణకు తాను సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న మహిళా రిజర్వేషన్​ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని.. ఈ నెల 10న జంతర్​ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉండడంతో విచారణకు హాజరయ్యే తేదీ మార్పు గురించి న్యాయ నిపుణులతో చర్చించి సలహా తీసుకుంటానని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు కవిత ఓ ప్రకటన విడుదల చేశారు.

రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న మహిళా రిజర్వేషన్​ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్​ అని కవిత పేర్కొన్నారు. అందుకే ఈ నెల 10న దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్​ జాగృతి ఒకరోజు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తామని అన్నారు. ఈక్రమంలో ఈ నెల 9న దిల్లీలో విచారణకు హాజరు కావాలని.. ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని.. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్​మెంట్​లు రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్​.. బీఆర్​ఎస్​ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని ఈ విషయం బీజేపీ పార్టీకి తెలుసని కవిత అన్నారు. సీఎం కేసీఆర్​ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పుడూ ఎండగడుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశ అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతిసారి గొంతెత్తుతామని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని తేల్చి చెప్పారు. ప్రజల హక్కుల గురించి నిరంతరం పోరాడతామని తెలిపారు.

BRS Ministers reaction on ED notice to Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట లాంటిదని మంత్రి జగదీశ్​రెడ్డి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్​పై కుట్రలో భాగంగానే ఈ నోటీసులు కవితకు పంపించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. మహిళా బిల్లు కోసం దిల్లీలో రేపటి నుంచి కవిత నిరాహార దీక్ష చేయనుతున్న నేపథ్యంలో ఈడీ నోటీసులిచ్చిందని మండిపడ్డారు. ఈ చర్యతో బీజేపీకి మహిళల పట్ల ఉన్న వైఖరి అర్థమవుతుందన్నారు.

బీఆర్ఎస్​, బీజేపీలు వేర్వేరు కాదు: రాష్ట్రంలో బీజేపీను పెంచే ప్రయత్నం గత రెండు సంవత్సరాలుగా సీఎం కేసీఆర్​ చేస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆక్షేపించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై ఆయన స్పందించారు. గతంలో కూడా కవితను సీబీఐ విచారించింది. ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చిందని.. రేపు ఆమెను అరెస్ట్​ చేసినా చేయవచ్చు అని జోస్యం చెప్పారు. కవితను అరెస్ట్​ చేస్తే అందులో నుంచి కూడా రాజకీయ లబ్ధిని పొందేందుకు బీఆర్​ఎస్​, బీజేపీలు చూస్తాయని ఆక్షేపించారు. ఈ విషయంలో కాంగ్రెస్​ పార్టీకి మొదట నుంచి అనుమానాలు ఉన్నాయని.. బీజేపీ, బీఆర్​ఎస్​ వేర్వేరు కాదని మరోసారి నిరూపించారని అన్నారు.

మహిళా రిజర్వేషన్లపై కవిత పోరాడుతుందనే ఈ కక్ష: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులను జారీచేయడాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,సత్యవతి రాథోడ్​లు తీవ్రంగా ఖండించారు. హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్​పై పోరాడే కవిత గొంతు నొక్క డానికే, కవితపై కక్ష సాధింపులో భాగంగానే ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. ఇక బీజేపీ పతనం ప్రారంభమైనట్లేనని, బీఆర్​ఎస్​ ద్వారా బీజేపీకు ముప్పు ఉందనే నోటీసులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేనికైనా మేము సిద్ధమని, దేశ వ్యాప్తంగా ఉద్యమించి బీజేపీ విద్రోహాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు.

కేసీఆర్​ను ఎదుర్కొలేకే కవితను వేధిస్తున్నారు: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్టనని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్​ను ఎదుర్కొలేకే కవితపై కక్ష్యపూరితంగా కేసులు పెట్టి.. వేధిస్తున్నారని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి విశ్వసనీయతను దెబ్బ తీసిందని తెలిపారు. ఈ సంస్థల నోటీసులు, కేసులు అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చారని దుయ్యబట్టారు. ఇన్ని లక్షల కోట్లు రూపాయలు అవినీతికి పాల్పడిన అదానీ గురించి కేంద్రం ఎందుకు నోరు మెదపడం లేదని.. ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు దర్యాప్తును చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు.

కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొని అక్రమంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మాటవినని వారిపై కేసులు పెడుతున్నారు.. దారికి వచ్చిన వారిపై దయచూపుతున్నారని మండిపడ్డారు. మేఘాలయ ఎన్నికల్లో సీఎం కాన్రాడ్​ సంగ్మాపై అవినీతి ఆరోపణలు చేయలేదా అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సంగ్నాకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది నిజమే కదా అని విమర్శించారు. సంగ్మా ప్రమాణ స్వీకారానికి బీజేపీ నేతలు హాజరు కావడం ద్వంద్వ నీతికి అద్దం పడుతుందని మంత్రి నిరంజన్​ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఈడీ, సీబీఐలకు బడ్జెట్​ పెంచండి: విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతోనే ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిందని ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​ ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలకు బడ్జెట్​ పెంచడం.. గల్లీ గల్లీకి ఈడీ, సీబీఐ శాఖలు పెట్టి అరెస్టులు చేయండని విమర్శించారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీకు అవసరం లేదని ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 9, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.