దిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో MLC కవితకు ఈడీ నోటీసులు

author img

By

Published : Mar 8, 2023, 8:49 AM IST

Updated : Mar 8, 2023, 10:18 AM IST

MLC కవిత

MLC Kavitha In Delhi Liquor Scam Case: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిసి కవిత ప్రశ్నించనున్నట్లు సమాచారం.

MLC Kavitha In Delhi Liquor Scam Case: దిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతున్నారు.. ఎవరికి నోటీసులు జారీ చేస్తుందనేది స్పష్టంగా తెలియడం లేదు. ఈ కేసులో వీలైనంత త్వరగా నిజానిజాలను బయటకు తీసేందుకు ఈడీ తీవ్రంగా శ్రమిస్తున్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఈ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఈ కేసులో పలు విషయాలను తెలుసుకోవడానికి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి రేపు.. కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే గతేడాది డిసెంబర్‌11న ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవిత ఇంటి వద్దనే విచారించారు. దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించి.. పలు కీలక విషయాలను ఆమె వద్దనుంచి రాబట్టారు.

మంగళవారం రోజున రామచంద్ర పిళ్లైను అరెస్ట్‌ చేయడం.. వెంటనే కవితకు నోటీసులు జారీ చేయడం చూస్తే ఇంకా మరికొన్ని కీలక విషయాలు రాబట్టే పనిలో ఈడీ ఉందని స్పష్టంగా అర్థమవుతుందని ఉన్నతవర్గాలు చెబుతున్నాయి. ఈ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని కూడా విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు కవితకు ఈడీ నోటీసులు జారీ కావడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

నిన్న రామచంద్ర పిళ్లై అరెస్ట్‌: నిన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ చేశారు. ఇక రామచంద్ర పిళ్లైను వారం రోజులు కస్టడీకి కావాలని ఈడీ చేసిన విజ్ఞప్తికి.. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు పర్మిషన్‌ ఇచ్చింది. ఇతని రిమాండ్‌ రిపోర్టులో మాత్రం కీలక విషయాలను చేర్చుతూ.. 17 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను తయారు చేసింది.

రిపోర్టులో ఈ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు అన్నీ తానై వ్యవహరించి రామచంద్ర పిళ్లై లబ్ధి చేకూర్చారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ప్రధానంగా భావిస్తున్న సౌత్‌ గ్రూప్‌ను ఇతను దగ్గరుండి నడిపించాడని ఈడీ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ఇంకా మరిన్ని విషయాలు ఇతని వద్దనుంచి రాబట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి.. ఇతనితో కలిపి విచారించాలని చూస్తుందని ఉన్నత వర్గాల సమాచారం.

మాజీ ఆడిటర్‌కు బెయిల్‌ మంజూరు.. మళ్లీ కస్టడీలోకి: గత వారంలోనే ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అరెస్ట్‌ చేసింది. ఇతనికి దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇతను ఇచ్చే సమాచారం చాలా కీలకంగా మారనుందని భావించి.. జ్యూడీషియల్‌ కస్టడీకి కోరుతూ సీబీఐ కోర్టును విజ్ఞప్తి చేసింది. వెంటనే అందుకు కోర్టు అంగీకరించి.. 14 రోజుల కస్టడీని పొడిగించింది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 8, 2023, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.