కరోనా టీకాల సరఫరా పెంచేందుకు భారీ స్థాయిలో నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టీకా పంపిణీ ప్రక్రియను కేంద్ర వైద్య శాఖ దగ్గరుండి పరిశీలిస్తోందని చెప్పారు. టీకా పంపిణీపై వచ్చే 15 రోజుల షెడ్యూల్ను రాష్ట్రాలకు ముందుగానే అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. తద్వారా జిల్లా అధికారులకు టీకా పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకునే సౌలభ్యం దక్కుతుందని అన్నారు.
కరోనాపై పోరులో జిల్లా స్థాయి అధికారుల అనుభవాలు తెలుసుకుని, వారి సలహాలు స్వీకరించేందుకు మంగళవారం వారితో మోదీ సమావేశమయ్యారు.
"వైరస్ సోకినా మీలో చాలా మంది పని చేస్తూనే ఉన్నారు. కరోనాపై పోరులో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మీరు ఫీల్డ్ కమాండర్ లాంటి వారు. విధానపరమైన మార్పులు ఏవైనా అవసరమని భావిస్తే.. సంకోచం లేకుండా చెప్పండి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కరోనాపై పోరులో టీకా పంపిణీనే అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. వ్యాక్సినేషన్పై ఉన్న అన్ని అపోహలను తొలగించాలని పిలుపునిచ్చారు. రెండో దశలో గ్రామీణ ప్రాంతాలపై అధికంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. స్థానిక కంటైన్మెంట్ జోన్లు, పరీక్షల సంఖ్య పెంపు ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు. ప్రజలకు సరైన, పూర్తి సమాచారం అందించాలని స్పష్టం చేశారు.
కరోనాపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప హాజరయ్యారు.
కరోనాపై పోరులో ఎదురైన అనుభవాలను వేర్వేరు రాష్ట్రాల అధికారులు మోదీకి వివరించారు.
ఇదీ చదవండి: భారత్ను ఒంటరిగా చుట్టేసిన మహిళ- ఎలాగంటే?