ETV Bharat / bharat

ఉగ్రవాదుల లక్షిత దాడులు.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు పౌరులు మృతి.. రంగంలోకి NIA

author img

By

Published : Jan 2, 2023, 8:04 AM IST

Updated : Jan 2, 2023, 7:10 PM IST

Rajouri firing incident
Rajouri firing incident

కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలో ఇళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించారు. మరోవైపు, బాధితుడి ఇంటి సమీపంలో ఓ ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో సాధారణ పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలో ఓ వర్గానికి చెందిన 3 ఇళ్లపై ఉగ్రమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సైన్యం, సీఆర్​పీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టి ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి.

మొత్తం 10 మందికి బుల్లెట్ గాయాలు కాగా వారిలో రాజౌరీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో ముగ్గురు మృతిచెందారని, జమ్ముకు తరలించిన మరొకరు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జమ్ముకు వాయుమార్గం ద్వారా తరలించారు. ఈ ఘటన పూర్తిగా భద్రతా వైఫల్యమని స్థానిక గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన వ్యాపారులు.. సోమవారం రాజౌరీ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగానే సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

పేలుడుకు ఇద్దరు చిన్నారులు బలి
ఇదిలా ఉండగా.. సోమవారం రాజౌరీలోని దాంగ్రి ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. మృతిచెందిన చిన్నారులిద్దరూ అన్నాచెల్లెళ్లు అని చెప్పాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించాయి. పేలుడుకు ఐఈడీ వాడినట్లు సమాచారం. ఆదివారం దాడి జరిగిన బాధితుడి ఇంటి వద్దే తాజా పేలుడు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో సైన్యంతో కలిసి జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కాగా, ఇదే ప్రాంతంలో మరో ఐఈడీ కనిపించిందని జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఎన్ఐఏ దర్యాప్తు..
రాజౌరీలో వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఆదివారం సాయంత్రం తర్వాత జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఎన్​ఐఏ దర్యాప్తు చేపట్టనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీనియర్ ఎన్ఐఏ అధికారి నేతృత్వంలోని ఓ బృందం మంగళవారం దాంగ్రీకి రానుందని పేర్కొన్నాయి. ఎన్ఐఏ జమ్ము బ్రాంచ్​కు చెందిన అధికారులు.. ఈ ఘటనపై విచారణ జరుపుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఎల్​జీ పరిహారం
మరోవైపు, ఉగ్రదాడిని జమ్ము కశ్మీర్ ఎల్​జీ మనోజ్ సిన్హా ఖండించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఘటనాస్థలానికి వెళ్లి ఆయన పరిశీలించారు.

ఘటనాస్థలానికి వెళ్లిన ఎల్​జీ మనోజ్ సిన్హా
ఘటనాస్థలానికి వెళ్లిన ఎల్​జీ మనోజ్ సిన్హా

ఇదీ చదవండి:

Last Updated :Jan 2, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.