ETV Bharat / bharat

'జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్​ 1- భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ప్లాన్ రెడీ'

author img

By PTI

Published : Dec 23, 2023, 3:47 PM IST

isro aditya l1 mission reach date
isro aditya l1 mission reach date

Isro Aditya L1 Mission Reach Date : సూర్యునిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ చివరి ఘట్టానికి చేరువైంది. వచ్చే నెల 6వ తేదీన తన గమ్యాన్ని చేరుకోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు.

Isro Aditya L1 Mission Reach Date : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరువైంది. జనవరి 6 తన గమ్యస్థానమైన లగ్రాంజ్‌ పాయింట్‌కు ఆదిత్య L1 చేరుకుంటుందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఓ ఎన్​జీఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. ఐదేళ్లపాటు భారత్‌ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుందన్నారు సోమ్‌నాథ్‌. సూర్యుడిలో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అలాగే భారత స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు.

"ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎల్‌1 పాయింట్‌కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్‌ను మండించాలి. అది మరింత ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఇది చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకియ వల్ల స్పేస్‌క్రాఫ్ట్ ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుని దాని చుట్టూ తిరుగుతుంది. అది విజయవంతంగా ఆ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే ఐదేళ్ల పాటు కక్ష్యలో తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు సూర్యుని డైనమిక్స్, అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ డేటా చాలా ఉపయోగకరంగా ఉంటుంది."
--ఎస్‌. సోమ్‌నాథ్, ఇస్రో ఛైర్మన్

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించారు. భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇది. భూమి నుంచి సుమారు 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1కు చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం ప్రారంభిస్తుంది. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లింది. సౌర జ్వాలలు, సౌర వాతావరణం, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 2వ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో.

కెమెరామెన్​ ఆదిత్యతో సూర్య!- సూపర్ ఫొటోస్​ చూశారా?

Aditya L1 Mission Update : ఆదిత్య-ఎల్​1 డేటా సేకరణ స్టార్ట్​.. ఏం రహస్యాలు తెలుస్తాయంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.