ETV Bharat / bharat

'న్యాయమూర్తులను ప్రభుత్వాలు దూషించడం దురదృష్టకరం'

author img

By

Published : Apr 9, 2022, 7:16 AM IST

NV Ramana Comments: కోర్టులు వెలువరించే తీర్పులు తమకు అనుగుణంగా రాకపోతే న్యాయమూర్తులను.. ప్రభుత్వాలు దూషించడం దురదృష్టకరమని జస్టిస్ ఎన్​వీ రమణ వ్యాఖ్యానించారు. ఇది కొత్త పోకడ అని, అత్యంత దురదృష్టకర పరిణామమని మండిపడ్డారు.

sc judges
sc judges

NV Ramana Comments: కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తం చేసే అభిప్రాయాలు తమ అభీష్టానికి అనుగుణంగా లేనప్పుడు.. ఆయా ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది కొత్త పోకడ అని, అత్యంత దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. ఇదివరకు ప్రైవేటు పార్టీలు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేసేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ అధికారి అమన్​కుమార్​పై నమోదైన ఎఫ్ఐఆర్​ను ఛత్తీస్​గఢ్​ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అవినీతి వ్యతిరేక కార్యకర్త ఉచిత్ శర్మ కూడా దీనిపై అప్పీలు దాఖలు చేశారు.

వీటిపై జస్టిస్ ఎన్​వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం పట్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్​వీ రమణ మాట్లాడుతూ "మీరు సీనియర్ న్యాయవాది. ప్రభుత్వం కోర్టును దూషించడం మొదలుపెట్టింది. కోర్టులోనూ రోజూ దీన్ని చూస్తున్నాం. ఈ కొత్త పోకడ గురించి మాకంటే ఎక్కువగా మీకే తెలుసు. ఇది చాలా దురదృష్టకర పరిణామం" అని పేర్కొన్నారు.

ఇదీ కేసు..: 2004లో సర్వీసులో చేరిన ఐఏఎస్ అమన్ కుమార్​ సింగ్​ మధ్యలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి, కాంట్రాక్టు విధానంలో సెక్రటరీగా చేరారు. సర్వీసులో చేరినప్పుడు అమన్ కుమార్​కు రూ.11 లక్షల విలువైన ఆస్తి ఉండగా, ఆ తర్వాత రూ.2.76 కోట్ల విలువైన ఏడు ఆస్తులను కూడబెట్టారని ద్వివేది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు అవినీతి వ్యతిరేక కార్యకర్త ఉచిత్ శర్మ తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. సంభావ్యత (ప్రాబబిలిటీ) ఆధారంగా నమోదైన కేసుగా చత్తీస్​గఢ్​ హైకోర్టు దీన్ని పేర్కొందని.. సంభావ్యత ఆధారంగా ఏ వ్యక్తిపైనా విచారణ చేపట్టబోమని వ్యాఖ్యానించిందన్నారు. నిజానికి సదరు అధికారి రూ.2,500 కోట్లు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయని దవే పేర్కొన్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ అప్పీలు అతిశయోక్తిగా ఉందంటూ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.