ETV Bharat / bharat

'కల్తీ' కేసుపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

author img

By

Published : Jun 10, 2021, 6:59 AM IST

supreme court
సుప్రీంకోర్టు

ఆహార కల్తీ విషయంలో నిందితుడి తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. నిందితుడి ముందస్తు బెయిల్​కు దరఖాస్తు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. ''కల్తీ' మీరు తింటానంటే బెయిల్ ఇస్తాం.. అందుకు సిద్ధమేనా?' అని నిలదీసింది.

ఆహార కల్తీ కేసులో నిందితుడి తరఫున ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసిన న్యాయవాదికి సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. చివరకు తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పవార్‌ గోయల్‌, వినీత్‌ గోయల్‌ అనే వ్యాపారులపై గోధుమపిండిని కల్తీ చేసిన నేరానికి కేసు నమోదైంది.

ఆహార కల్తీ కేసులో ఆరోపణలకు బెయిల్‌ ఇవ్వొచ్చని.. కాబట్టి తన క్లయింట్లను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని పునీత్‌జైన్‌ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం...

"ఒక్క మనదేశంలోనే ఆరోగ్యంపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. మీరుగానీ, మీ కుటుంబంగానీ మీ క్లయింట్‌ తయారు చేసి అమ్ముతున్న ఆహారాన్ని తింటే బెయిల్‌ ఇస్తాం. అందుకు మీరు సిద్ధమేనా?"అని నిలదీసింది. దీంతో.. న్యాయవాది సమాధానమివ్వలేదు.

"సమాధానం ఇవ్వటానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఇతరుల ప్రాణాలైతే పోతే పోనీ.. మనకేంటి అనుకుంటున్నారా?" అని న్యాయమూర్తులు అడగటంతో న్యాయవాది తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

ఇదీ చదవండి : 'కరోనాపై 'సర్జికల్ స్ట్రైక్' చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.