ETV Bharat / bharat

Chandrababu Quash Petition Filed in AP High Court: హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు.. నేడు విచారణ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 9:03 AM IST

Updated : Sep 13, 2023, 2:59 PM IST

Chandrababu Quash Petition Filed in High Court : ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే తనను కేసులో ఇరికించారని టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ వేశారు. ప్రాథమిక ఆధారాలు లేకపోయినా కేసు పెట్టారని.. సీఐడీ నమోదు చేసిన కేసు, రిమాండ్‌ ఉత్తర్వులు కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.

Chandrababu_Quash_Petition_filed_in_High_Court
Chandrababu_Quash_Petition_filed_in_High_Court

Chandrababu Quash Petition Filed in AP High Court: హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు.. నేడు విచారణ

Chandrababu Quash Petition Filed in High Court : స్కిల్ కుంభకోణం పేరిట సీఐడీ తనపై నమోదు చేసిన కేసు, దాని ఆధారంగా అనిశా కోర్టు విధించిన జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు (Chandrababu Quash Petition) చేశారు. ఈ వ్యాజ్యం పరిష్కారం అయ్యే వరకూ తనపై అనిశా కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో, APSSDC ఛైర్మన్‌ అజయ్‌రెడ్డిని వ్యాజ్యంలోప్రతివాదులుగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్‌పై కేసు పెట్టాలంటే గవర్నర్‌ నుంచి ముందస్తు ఆమోదం తప్పనిసరి అని, అలా కాకుండా సీఐడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అత్యవసర విచారణకు అనుమతించాలని కోరారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.

TDP Chief Chandrababu Naidu Moves AP HC to Dismiss Skill Development Case : నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు APSSFC, సీమెన్స్‌ మధ్య ఒప్పందం జరిగింది. నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబరు 9న సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీనిలో తన పాత్ర గురించి ఆ ఫిర్యాదులో ప్రస్తావనే లేదని.. ఓ నిందితుడు చెప్పారని ఏడాది తర్వాత తన పేరు తెరపైకి తెచ్చారని చంద్రబాబు తెలిపారు.

Design Tech MD Vikas Khanvilkar Reacts to CBN Arrest: స్కిల్ ఒప్పందంలో అవినీతికి తావేలేదు.. చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం..: డిజైన్‌టెక్‌ ఎండీ

తప్పుడు కేసులో ఇరికించి తనను అరెస్టు చేయాలని సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో వ్యవహరించాయని వివరించారు. రిమాండు రిపోర్టులో ఒక్కటైనా చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేవన్నారు. తనపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని.. చేయని నేరానికి నన్ను బలిపశువును చేయాలనే లక్ష్యంతో ఆరోపణలు చేసినట్లు అర్థమవుతోందని చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోయినా నన్ను నిందితుడిగా చేర్చారని.. ఈ కేసులో తదుపరి చర్యలను కొనసాగనిస్తే విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు అవుతుందని చంద్రబాబు వివరించారు.

‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13, ఐపీసీ సెక్షన్‌ 409 తప్ప మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవే. అవినీతి నిరోధక చట్ట సెక్షన్‌ 13, ఐపీసీ 409 ప్రకారం నేరానికి పాల్పడినట్లు తనపై నిర్దిష్ట ఆరోపణలు లేవని చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్షన్‌ 420 తనకు వర్తింపజేయడానికి వీల్లేదన్నారు. కుట్రపూరిత ఒప్పందం చేసుకున్నట్లు కనీస ఆధారాలు లేవని తెలిపారు. అలాంటప్పుడు సెక్షన్‌ 120బీ చెల్లదని.. అనినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(1)(సీ),(డీ) ప్రకారం నేరపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నాపై ఆరోపణలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చెల్లుబాటు కాదని వివరించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (Skill Development Project) ఏర్పాటు గురించి ఆనాడు సీనియర్‌ అధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నారన్నారు. గుజరాత్‌లో సీమెన్స్‌ సంస్థ కార్యకలాపాలను వారు పరిశీలించారని.. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకొని నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రాజెక్టు అమలు కాలేదని దర్యాప్తుసంస్థ తేల్చినప్పుడే పబ్లిక్‌ సర్వెంట్‌ విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లు అవుతుందన్నారు. సీఐడీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా ఊహాజనిత ఆరోపణలు చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని ఈ కేసులో దర్యాప్తు చేసే అధికారం, తనను అరెస్టు చేసే అధికారం, జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించాలని అభ్యర్థించే హక్కు సీఐడీకి లేవన్నారు. సెక్షన్‌ 17ఏ ప్రకారం గవర్నర్‌ అనుమతి లేకుండా తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినందున అది చెల్లుబాటు కాదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17A 2018 జులై 26న అమల్లోకి వచ్చింది. ఇక మీదట పబ్లిక్‌ సర్వెంట్లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలంటే కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు 2021లో కీలక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ముందస్తు సమ్మతి తీసుకోవాలి.

Condemnation on Chandrababu Naidu Arrest: 'రాజకీయ విద్వేషంతో అరెస్టులా..!' చంద్రబాబు కేసుపై జార్ఖండ్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు విస్మయం

2021 డిసెంబరు 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ విషయంలో గవర్నర్‌ ఆమోదం లేకుండా జరుగుతున్న ప్రక్రియ అంతా చట్ట విరుద్ధమేనని చంద్రబాబు తెలిపారు. ఈ కేసులో సీఐడీకి దర్యాప్తు చేసే అధికారం గానీ. విచారణ పరిధి, రిమాండు విధించే అధికారం గానీ అనిశా కోర్టుకు లేవు. గవర్నర్‌ ఆమోదం పొందలేదనే విషయాన్ని అనిశా ప్రత్యేక కోర్టు విస్మరించి, రిమాండు విధించిందని క్వాష్‌ పిటిషన్‌లో చంద్రబాబు వివరించారు. ఈ కేసు ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేకకోర్టు పరిధిలోకి వస్తుంది. కాబట్టి నాపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు.

స్కిల్‌ కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత.. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే తనను ఇరికించారన్నారు. ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం జడ్‌+ సెక్యూరిటీ కల్పించిందని, రాజకీయ ప్రత్యర్థులు నన్ను అంతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. కారాగారంలో ఉంచడం సురక్షితం కాదని.. జడ్‌+ సెక్యూరిటీకి తనను దూరంగా ఉంచాలని, తద్వారా ప్రత్యర్థులు లక్ష్యాన్ని సులువుగా సాధించేలా అధికార పార్టీ, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చూస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు.

రిమాండు ఉత్తర్వుల్లో అనిశా కోర్టు కొన్ని కీలకాంశాలను విస్మరించిందన్నారు. ప్రస్తుత కేసులో రిమాండు ఎందుకు అవసరమో పేర్కొనలేదన్నారు. రిమాండు విధింపుపై మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా అనిశా కోర్టు రిమాండు విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. అనిశా కోర్టులో విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.

Chandrababu Family Members Mulakat: చంద్రబాబు భద్రతపై భయంగా ఉంది.. ఆయన కట్టిన జైలులోనే కట్టిపడేశారు: భువనేశ్వరి

Last Updated : Sep 13, 2023, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.