ETV Bharat / bharat

పెట్రోల్​ పోసి నిప్పంటించిన వ్యక్తిని పట్టుకున్న మహిళ.. ఇద్దరూ సజీవదహనం

author img

By

Published : Apr 27, 2022, 2:09 PM IST

burned woman hugged the worker who poured petrol on her and set fire
పెట్రోల్​ పోసి నిప్పంటించిన వ్యక్తిని పట్టుకున్న మహిళ.. ఇద్దరూ సజీవదహనం

తనపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వ్యక్తిని ఆలింగనం చేసుకుంది ఓ మహిళ. దీంతో ఇద్దరూ మంటల్లో కాలిపోయి చనిపోయారు. మహారాష్ట్ర పుణెలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో మీర్జాపుర్ వెబ్ సిరీస్ చూసి సొంత అన్ననే దారుణంగా హత్య చేశాడు తమ్ముడు.

మహారాష్ట్ర పుణె వడ్​గావ్ శేరిలోని సోమ్​నాథ్ నగర్​లో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. లేడీస్ టైలరింగ్​ షాపు నిర్వహించే మహిళపై అక్కడ పనిచేసే ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనను పని నుంచి తొలిగించిందని ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే మంటలు అంటుకున్న మహిళ.. పెట్రోల్​ పోసిన వ్యక్తిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరూ మంటల్లో కాలిపోయారు. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రే నిందితుడు మిలింద్ గోవింద్​ రావ్​ మరణించాడు. ఆ మరునాడే బాధిత మహిళ బాల నోయ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరిగినప్పుడు మహిళను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తికి కూడా కాలిన గాయాలయ్యాయి.

భర్తతో గొడవపడి నిప్పంటించుకున్న భార్య: ఛత్తీస్​గఢ్​ కోర్బాలో భర్తతో గొడవపడి ఒంటికి నిప్పంటించుకుంది ఓ మహిళ. అతను ఫోన్లో మరో మహిళతో మాట్లాడటం చూసి వాగ్వాదానికి దిగి ఈ చర్యకు పాల్పడింది. కాలిన గాయాలైన ఆమెను భర్తే ఆస్పత్రిలో చేర్పించాడు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. భార్యను కాపాడే క్రమంలో భర్త చేతికూడా పాక్షికంగా కాలిపోయింది.

తనకు వచ్చింది రాంగ్ కాల్​ అని, అది చెబుతున్నా వినకుండా భార్య నిప్పంటించుకుందని భర్త తెలిపాడు. మొదట ఆమెను కోర్బా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యుల సూచన మేరకు బిలాస్​పుర్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఈ ఘటన జరిగింది. భర్త పేరు మహంత్ కాగా.. భార్య పేరు పూజ.

మీర్జాపుర్ చూసి అన్నను చంపిన తమ్ముడు: దిల్లీ గాజియాబాద్​లోని ఇందిరాపురంలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. మీర్జాపుర్ వెబ్​ సిరీస్​ చూసి సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. పక్కా పథకం ప్రకారం సోదరుడ్ని హతమార్చాడు. ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

'నిందితుడు తేజ్​పాల్​ తన సోదరుడు అంకుర్​ పాల్​ను బీర్ తాగుదామని బయటకు తీసుకెళ్లాడు. అడవిలాంటి ప్రదేశానికి వెళ్లాక అతని గొంతు కోసి హత్య చేశాడు. ఎవరికీి అనుమానం రాకుండా అతని స్కూటర్​ను దూరంగా పార్క్​ చేసి మొబైల్​ను కూడా అక్కడే వదిలేశాడు. ఇద్దరికీ ఇప్పటికే ఆస్తుల విషయంలో గొడవలున్నాయి. మీర్జాపుర్ చూసిన అనంతరం తేజ్​పాల్ ఈ హత్యకు కుట్రపన్నాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు' అని పోలీసులు వెల్లడించారు.

14నెలల చిన్నారితో తల్లి ఆత్మహత్య: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా నందానగర్​ బ్లాక్​లోని సర్పాణి గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వివాహిత తన 14 నెలల బిడ్డతో పాటు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలి పేరు అనీషా. వయసు 20 ఏళ్లు. ఆమె బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. అనీషా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను వెతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె ఓ చెట్టుకు శవంగా వేలాడుండటం చూసి షాక్​కు గురయ్యారు. ఆమెతో పాటు 14నెలల బిడ్డ కూడా విగతజీవిగా ఉండటం అందరికీ కలచివేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఇంటర్నెట్​ కేబుల్​తో షాక్​.. 22ఏళ్ల యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.