వరకట్నం సరిపోలేదని పెళ్లి ఆపేసిన వధువు.. షాక్​లో వరుడు

author img

By

Published : Mar 10, 2023, 9:18 AM IST

Bride canceled wedding for dowry in medchal

Bride canceled wedding for dowry in medchal : మరికాసేపట్లో పెళ్లి. మరో గంటలో పెళ్లికూతురి మెడలో తాళి కడతాననే ఉత్సాహంతో పెళ్లి కుమారుడు బంధుమిత్ర సపరివారంగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. ఎంతసేపైనా వధువు తరఫున వారు రాలేదు. ఏమైందని ఆరా తీసిన వరుడికి వధువు షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Bride canceled wedding for dowry in medchal : పెళ్లి ఆగిపోయిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వరకట్నం ఒకటి. కట్నం సరిపోలేదని అబ్బాయి పెళ్లి ఆపేసిన సంఘటనలు ఇప్పటికే మనం చాలా చూశాం. కానీ ఓ పెళ్లి మాత్రం ఊహించని విధంగా ఆగిపోయింది. మరో గంటలో పెళ్లి జరగనుండగా.. తనకు ఎదురుకట్నం సరిపోలేదని ఓ వధువు పెళ్లికి నో చెప్పింది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఓసారి మీరూ చదివేయండి.

Bride canceled wedding for dowry in ghatkesar : వివాహానికి వచ్చిన బంధువులతో ఆ ఫంక్షన్ హాల్ అంతా కోలాహలంగా మారింది. ఇంతలోనే వరుడికి వధువు షాక్​ ఇచ్చింది. నాకు పెళ్లి వద్దంటూ తెగేసి చెప్పింది. ప్రేమ వ్యవహారం, అదనపు వరకట్నం కోసం వరుడి తరఫున వాళ్లు ఇబ్బంది వధువు తరుపు వారిని బలవంతపెట్టడం వంటి కారణాల వల్ల పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోవడం వంటి సంఘటనలు నిత్యం ఏదో చోట బయటకు వస్తూనే ఉంటాయి. కానీ తాజాగా వధువు తనకు వరుడి తరఫున వాళ్లు ఇచ్చిన వరకట్నం సరిపోలేదని పెళ్లినే రద్దు చేసింది. ఈ పంచాయతీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహం కుదిరింది. అమ్మాయికి ఎదురు కట్నం కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం జరిగింది. గురువారం ఈ నెల 9న రాత్రి 7 గంటల 21 నిమిషాలకు వివాహం ముహూర్తం నిశ్చయించారు. ఘట్​కేసర్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో వివాహం జరుగుతుందని అబ్బాయి కుటుంబ సభ్యులు ఆహ్వాన పత్రిక బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆ ఫంక్షన్ హాల్​కు చేరుకున్నారు.

ముహూర్తం సమయం దగ్గరపడుతున్నా అమ్మాయి రాకపోవడంతో అబ్బాయి కుటుంబ సభ్యులు ఏమైందని ఆరా తీశారు. పెళ్లికూతురు అబ్బాయి వాళ్లు ఇచ్చే కట్నం సరిపోలేదని అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసింది. తను డిమాండ్ చేసే కట్నం ఇవ్వకపోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తానని తెగేసి చెప్పింది. ఏం చేయాలో పాలుపోనే వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించారు.

స్థానిక సీఐ అశోక్ రెడ్డి వధువు కుటుంబ సభ్యులను స్టేషన్​కు పిలిపించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారిని మందలించి ఇరు కుటుంబ సభ్యులు రాజీకుదిర్చేందుకు ప్రయత్నించినా వారు దానికి ససేమిరా అన్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. బంధువులతో కళకళలాడాల్సిన కల్యాణ మండపం కాస్త వెలవెలబోయింది. ఇలాంటి కారణంతో పెళ్లి ఆగిపోవడం ఇదే మొదటిసారి అని చుట్టుపక్కల వాళ్లు మాట్లాడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.