ETV Bharat / bharat

భాజపాతో నితీశ్ కటీఫ్​? ఆర్జేడీ, కాంగ్రెస్​తో కలిసి ముందుకు..!

author img

By

Published : Aug 8, 2022, 1:47 PM IST

Updated : Aug 8, 2022, 6:48 PM IST

JDU BJP alliance news: బిహార్ రాజకీయాలు కీలక మలుపు తీసుకునేలా కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా భాజపా, జేడీయూ మధ్య దూరం పెరుగుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. తాజాగా ఏమైందంటే?

NITISH KUMAR RJD
NITISH KUMAR RJD

JDU BJP alliance break up: బిహార్‌లో భాజపా, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం బీటలు వారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాజపా, జేడీయూ మధ్య విభేదాలు తలెత్తాయంటూ.. కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. భాజపాతో భాగస్వామ్యం తెంచుకోవాలని.. జేడీయూభావిస్తున్నట్లు సమాచారం. భాజపా నుంచి విడిపోయి.. బిహార్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై సీఎం నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ, వామపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి నితీశ్ కుమార్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నితీశ్ కుమార్‌ ఆదివారం ఫోన్‌లో మాట్లాడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సోనియాను కలిసేందుకు నితీశ్ సమయం కోరినట్లు పేర్కొన్నాయి.

బిహార్‌ రాజకీయాలపై జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా.. ఒక్కో పరిణామం చోటు చేసుకుంటోంది. నితీశ్‌ కుమార్‌ మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఆసక్తి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది.

తాజా పరిణామాల నేపథ్యంలో బిహార్‌ కాంగ్రెస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత అజిత్‌ శర్మ నివాసంలో.. ఎమ్మెల్యేలతో హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేసింది. సోషలిస్టు సిద్ధాంతాలు కలిగి ఉన్న జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్‌ భాజపాను వీడితే స్వాగతిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు.. ఎన్‌డీఏను పారదోలాలని నితీశ్‌ బయటకు వస్తే ఆలింగనం చేసుకొని మరీ ఆహ్వానం పలుకుతామని ఆర్‌జేడీ ఉపాధ్యక్షుడు శివానంద్‌ తివారీ స్పష్టం చేశారు. భాజపాపై పోరాటానికి ఆర్‌జేడీ సైతం కట్టుబడి ఉందన్న ఆయన.. నితీశ్‌ వస్తే ఆయన వెంట నడుస్తామన్నారు.

"అసలు ఏం జరుగుతుందో వ్యక్తిగతంగా అయితే నాకు తెలీదు. కానీ, రెండు పార్టీలు కలిస్తే అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో ఇరుపార్టీలు ఇలాంటి భేటీ నిర్వహించడాన్ని తేలికగా తీసుకోకూడదు. అది సాధారణ విషయం కాదు. ఎన్​డీఏను దూరం పెట్టాలని నితీశ్ నిర్ణయం తీసుకుంటే ఆయనతో కలవడం తప్ప మాకు అవకాశాలేం ఉంటాయి? భాజపాపై పోరాడేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి కూడా ఈ పోరులో భాగం కావాలనుకుంటే.. ఆయన్ను మాతో చేర్చుకుంటాం."
-శివానంద్ తివారీ, ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు

భాజపాతో బంధం తెంచుకుంటే నితీశ్‌కు మద్దతు ఇస్తామని 12మంది ఎమ్మెల్యేలు ఉన్న సీపీఐఎంల్‌ ప్రకటించింది.ప్రభుత్వంలో మార్పులు
వస్తే స్వాగతించే పరిణామమేనని బిహార్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న సీపీఎం తెలిపింది.

నితీశ్ నేతృత్వంలోని జేడీయూ.. కేంద్రంతో పాటు బిహార్‌ ఎన్డీఏలో భాగస్వామి. అయితే మిత్రపక్షాల మధ్య దూరం పెరిగినట్లు ఇటీవల అనేక వార్తలు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అవన్నీ తోసిపుచ్చుతూ ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే.. జేడీయూ మద్దతు ఇచ్చింది. అయితే, ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ భేటీకి నితీశ్ కుమార్.. గైర్హాజరు కావడం రాజకీయంగా మరోసారి చర్చకు దారి తీసింది. కొవిడ్‌ బారిన పడిన నితీశ్‌ నీరసంగా ఉండటం వల్లే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదే రోజు పట్నాలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో నితీశ్‌ పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ భాగం కాబోదని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించారు.

Last Updated :Aug 8, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.