మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాటలను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. బాపూజీపై న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కథనాన్ని రాసిన ఆయన.. 'గాంధీలాంటి వారు ఈ భూమి మీద తిరిగాడన్న విషయాన్ని రాబోయే తరాలు నమ్మలేకపోవచ్చు' అన్న ఐన్స్టీన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి గురువుగా, స్ఫూర్తినిచ్చే వెలుగుగా జాతిపిత మహాత్మాగాంధీని అభివర్ణించారు మోదీ.
మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా భారత్కు, 'ప్రపంచానికి గాంధీ అవసరం ఎందుకు' అన్న పేరుతో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కథనాన్ని రాసిన మోదీ....మానవత్వాన్ని విశ్వసించే వారందరినీ గాంధీ ఏకం చేస్తున్నారని ప్రశంసించారు.
" మహాత్ముడి సిద్ధాంతాలను భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా చేయాలి. ఇందుకోసం మేధావులు, వ్యాపారులు, సాంకేతిక నిపుణులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలి. గాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో పాట.. ఇతరుల బాధను నిజమైన మనిషి మాత్రమే గుర్తిస్తాడు. అహంకారంతో ఉండకుండా వారి సమస్యను తీరుస్తాడని ఈ గీతం చెబుతుంది. ద్వేషం, హింస, బాధను అంతం చేసేందుకు ప్రపంచమంతా భుజం, భుజం కలిపి పని చేయాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి