ETV Bharat / bharat

లద్దాఖ్​లో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం: సైన్యం

author img

By

Published : Sep 16, 2020, 6:33 PM IST

Indian Army
పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకైనా సిద్ధం: సైన్యం

తూర్పు లద్దాఖ్​లో ఎముకలు కొరికే చలిలోనూ పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకైనా సిద్ధమని చైనాకు గట్టి హెచ్చరికలు పంపింది భారత సైన్యం. యుద్ధం చేసేందుకే చైనా మొగ్గుచూపితే.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న భారత సైనికులను ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేసింది. యుద్ధం గెలిచే స్థితిలో భారత సైన్యం లేదని చైనా అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ పేర్కొన్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది సైన్యం.

భారత్​, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల భద్రతకు అన్ని విధాలా సిద్ధమవుతోంది సైన్యం. తూర్పు లద్దాఖ్​లో వచ్చే చలికాలంలోనూ పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది. యుద్ధ పరిస్థితులను చైనా సృష్టించినట్లయితే.. మెరుగైన శిక్షణ పొందిన, పూర్తి సన్నద్ధతతో, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న భారత దళాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరికలు పంపింది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న భారత దళాలతో పోలిస్తే.. చైనా సైనికులు ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు చెందినవారని, క్షేత్రస్థాయిలో సవాళ్లను ఎదుర్కొన్న సందర్భాలు లేవని పేర్కొంది.

సరిహద్దులో యుద్ధం వస్తే పోరాడేందుకు భారత దళాలు సిద్ధంగా లేవని, వచ్చే చలికాలంలో పోరాటం చేయలేవని చైనా అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ పేర్కొంది. చైనా మీడియా కథనం నేపథ్యంలో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది భారత సైన్యం ఉత్తర కమాండ్​ ప్రధాన కార్యాలయం.

"చైనా మీడియా అంచనాలు అజ్ఞానానికి ప్రతీక. భారత సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్​లో చలికాలంలోనూ పూర్తిస్థాయి యుద్ధం చేసే సామర్థ్యానికి మించి ఉన్నాం. భారత్​ శాంతికాముక దేశం. పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలనుకుంటుంది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకునేందుకే మొగ్గుచూపుతుంది. తూర్పు లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్న క్రమంలోనే సైనిక సన్నాహాలు కొనసాగుతున్నాయి."

- సైనికాధికారి, ఉత్తర కమాండ్​ ప్రధాన కార్యాలయం ప్రతినిధి. ​

లద్దాఖ్​లో నవంబర్ తర్వాత ఉష్ణోగ్రతలు మైనస్​ 40 డిగ్రీలకు పడిపోయి సుమారు 40 అడుగుల మేర మంచు కురుస్తుందని తెలిపారు ఓ అధికారి. అయినప్పటికీ చలికాలంలోనూ పోరాడే అనుభవం భారత దళాలకు ఉందన్నారు.

సాధారణంగా లద్ధాఖ్​ చేరుకునేందుకు రెండు మార్గాలు జోజిలా, రోహ్​తాంగ్​ ఉన్నాయి. ఇటీవలే మూడో మార్గం దార్చా-లేహ్​ను పూర్తి చేసింది భారత్​. దీని ద్వారా తక్కువ సమయంలో శత్రువులకు దొరకకుండా సరిహద్దుకు చేరుకోవచ్చని తెలిపారు ఆ అధికారి. రోహ్​తాంగ్​ మార్గమంలోని అటల్​ సొరంగం పూర్తికావటం సహా అతిపెద్ద ఎయిర్​బేస్​లను కలిగి ఉండటం మరింత బలం చేకూర్చుతుందన్నారు. ఇప్పటికే.. మంచు తొలగించే యంత్రాలు, ఇంధనం, ట్యాంకులకు ల్యూబ్రికెంట్స్, విడిభాగాలు వంటివి అవసరమైన మేరకు నిల్వ చేసుకున్నట్లు చెప్పారు. ​సైనికులకు ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే దుస్తులు, ఆయుధాలు, క్షిపణులు, యుద్ధ ట్యాకులు, వంటి ఇతర మందుగుండు సామగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.