బంగాల్ రాజధాని కోల్కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డెంగీ కేసులు పెరగడంపై ప్రభుత్వాన్ని తప్పుబడుతూ భాజపా కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అధికార తృణమూల్ కాంగ్రెస్.. డెంగీ కేసుల గణాంకాలను తారుమారు చేస్తోందని ఆరోపించారు. 'డెంగీ రహిత నగరం కావాలి' అనే నినాదాలతో కోల్కతా వీధుల్ని హోరెత్తించారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. చాందిని చౌక్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వెనుదిరగమని నిరసనకారులను హెచ్చరించారు. కానీ కొందరు పోలీసులపైకి మంచినీటి సీసాలు విసిరారు. అనంతరం పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జలఫిరంగులతో వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అనేక మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ర్యాలీకి భాజపా యువ మోర్చ అధ్యక్షత వహించింది. సెంట్రల్ అవెన్యూ నుంచి కోల్కతా పురపాలక సంఘం(కేఎమ్సీ) వరకు ఈ ర్యాలీ చేపట్టాలనుకుంది.
"డెంగీ వ్యాధితో మరిణించిన వారి వివరాలను దాచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యాధిని నిర్మూలించడం పోయి.. గణాంకాలను తారుమారు చేసే పనిలో పడింది ప్రభుత్వం."
--- దిలీప్ ఘోష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.
కోల్కతా, పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు 44వేల 852 డెంగీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అధికార గణాంకాల ప్రకారం వ్యాధితో 25మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: శబరిమల, రఫేల్ కేసులపై రేపు సుప్రీం తీర్పు