ETV Bharat / bharat

బిహార్​ పోరు: నితీశ్​ 'లిక్కర్'​ అస్త్రం ఫలించేనా?

author img

By

Published : Sep 16, 2020, 6:04 PM IST

bihar-mahasamar-2020-nitishs-eye-on-women-voters-will-women-drive-the-election-this-time-again
బిహార్​ పోరు: నితీశ్​ 'లిక్కర్'​ అస్త్రం ఫలించేనా?

గ్రామస్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకు ఎలాంటి ఎన్నికలు వచ్చిన మహిళా ఓటర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు పోటీ పడుతుంటారు. మగువల ఓటు చలవతో ఏర్పాటైన ప్రభుత్వాలు అనేకం. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ​ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. వారిని ఆకర్షించేందుకు సీఎం నితీశ్​ కుమార్​ ఏం చేయబోతున్నారు? నారీమణులే లక్ష్యంగా అయన సంధించే ఎన్నికల అస్త్రం ఏమై ఉంటుంది?

"బిహార్​లో నేటి నుంచి అన్ని రకాల మద్యంపై నిషేధం విధిస్తున్నాం. హోటళ్లు, బార్​లు, క్లబ్​లు, ఇతర ప్రదేశాల్లో మద్యం అమ్మడం, తాగడం చట్టవ్యతిరేకం."
-2016 ఏప్రిల్​ 5న సీఎం నితీశ్​ ప్రకటన

బిహార్​లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మరి బిహార్​లోని మహిళాలోకం నితీశ్​కు మరోమారు జైకొడుతుందా? ఎన్​డీఏకి పట్టం కడుతుందా? మహిళా ఓటు బ్యాంకుపై నితీశ్​ గురిపెట్టిన ఇతర అస్త్రాలేంటి?

విజయంలో సగం!
బిహార్​ ఎన్నికల్లో మహిళల పాత్ర చాలా కీలకం. జనాభాలో దాదాపు సగం ఉన్న వారికి రాజకీయంగా, ప్రభుత్వపరంగా పెద్దపీటే వేస్తారు. వారి అనుగ్రహం పొందితే ఎన్నికల్లో విజయం సునాయాసంగా వరిస్తుందనేది రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నమ్మకం. దీన్ని మొదటినుంచి ముఖ్యమంత్రి నితీశ్​ సైతం గట్టిగానే విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ మహిళలకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకుంటారు.

2010 ఎన్నికల నుంచే...

బిహార్ రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యాన్ని తెలియచెప్పాయి 2010 శాసనసభ ఎన్నికలు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి పురుషులకన్నా అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఆ ఎన్నికల్లో నితీశ్​ విజయం సాధించేందుకు ప్రధాన కారణాల్లో మహిళల మద్దతు ఒకటన్నది విశ్లేషకుల మాట. ఏకంగా 37 మంది మహిళలకు శాసనసభకు ఎన్నికవడం, వారిలో జేడీయూ సభ్యులే ఎక్కువగా ఉండడం మరో విశేషం.

వాస్తవానికి 2005లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే మహిళా ఓటుబ్యాంకుపై గురిపెట్టారు నితీశ్. గ్రామ పంచాయతీల్లో 50శాతం రిజర్వేషన్​ వంటి నిర్ణయాలతో మహిళా సాధికారతకు కృషిచేశారు. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి, విద్యార్థినులకు ప్రోత్సాహకాలు, ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, సైకిళ్లు పంపిణీ వంటి కార్యక్రమాలతో సంక్షేమ మంత్రం జపించారు.

అలా 2005 నుంచి మహిళల అభిమానాన్ని కూడగడుతూ వస్తున్న నితీశ్​... ఇప్పుడు మద్యపాన నిషేధం అనే బ్రహ్మాస్త్రంతో 2020 ఎన్నికలకు సిద్ధమయ్యారు.

"మహిళలు అన్ని వేళలా నితీశ్​ కుమార్‌తోనే ఉన్నారు. ఈసారి కూడా ఎక్కువ మంది మహిళలు మాకే ఓటు వేస్తారు. మద్యపాన నిషేధం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. మహిళలపై వేధింపులు కూడా ఉండవు. ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతినదు."

-రాజీవ్ రంజన్, జేడీయూ ప్రతినిధి

"మద్యపాన నిషేధం చాలా కీలకమైన అంశం. ఇది గృహ హింసను గణనీయంగా తగ్గించటానికి ఉపయోగపడుతుంది. నితీశ్​ కుమార్ మహిళల ఓట్లను రాబట్టుకోవడానికి ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే గ్రామాల్లో బ్లాక్​ మార్కెట్లో మద్యం ఇంకా లభిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇది పెద్ద సవాలుగా మారింది."
- డీఎం దివాకర్, రాజకీయ విశ్లేషకుడు

ప్రతిపక్ష ఆర్​జేడీ వాదన మాత్రం మరోలా ఉంది. "మద్యపాన నిషేధం కారణంగా జేడీయూకు ఓట్లు పడవు. ఎందుకంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసింది నితీశ్​ ప్రభుత్వం కాదు. మహాకూటమి(ఆర్​జేడీ-జేడీయూ) ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నితీశ్​ ఆ నిర్ణయాన్ని అమలు చేశారంతే." అన్నారు ఆర్​జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ తివారీ.

మద్యంపై నిషేధం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. అయినా సర్కారు ఆ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తోంది. మరి ఈసారి మహిళా లోకం నితీశ్​కు మద్దతుగా నిలుస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.