ETV Bharat / bharat

అక్రమ భూ లీజు కేసులో మాజీ ప్రధానిపై అరెస్ట్ వారెంట్

author img

By

Published : Apr 27, 2020, 2:20 PM IST

అక్రమ భూ లీజుల కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అక్కడి అధికారులు. 34 ఏళ్ల కిందటి ఈ కేసులో దర్యాప్తునకు సహకరించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జంగ్ వార్తా సంస్థకు అక్రమంగా భూకేటాయింపులు చేశారన్న ఆరోపణల ఆధారంగా నవాజ్​పై కేసు నమోదు చేసింది పాక్ అవినీతి వ్యతిరేక విభాగం.

nawaz
అక్రమ భూ కేటాయింపుల కేసులో మాజీ ప్రధానిపై అరెస్ట్ వారెంట్

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్​పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అక్కడి అధికారులు. లండన్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనపై 34 ఏళ్ల కిందటి అక్రమ భూ కేటాయింపుల కేసులో అరెస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1986లో పాక్​లోని పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో.. జంగ్ వార్తా సంస్థ నిర్వాహకుడు షకీల్ ఉర్ రెహమాన్​కు అక్రమంగా భూ కేటాయింపులు చేశారని నవాజ్​పై ఆరోపణలు ఉన్నట్లు ఆ దేశ అవినీతి వ్యతిరేక విభాగం పేర్కొంది.

"జాతీయ అవినీతి వ్యతిరేక విభాగం.. పీఎంఎల్​ఎన్ అధినేత నవాజ్​ షరీఫ్​పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జంగ్ సంస్థ నిర్వాహకుడు షకీల్ ఉర్ రెహమాన్​కు అక్రమంగా భూ కేటాయింపులు చేయడంలో నవాజ్ జోక్యం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులిచ్చాం.. మా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని కోరాం. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు."

-పాక్ అవినీతి వ్యతిరేక విభాగ అధికారి

మూడు సార్లు పాక్ ప్రధానిగా పనిచేసిన నవాజ్​ ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే దర్యాప్తునకు సహకరించని కారణంగానే ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించారు అధికారులు. అవినీతి నిరోధక న్యాయస్థానానికి ఈ అంశాన్ని నివేదిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: స్వావలంబనే ధ్యేయంగా.. జాతీయ వ్యూహం అవసరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.