ETV Bharat / bharat

భారత్​, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు

author img

By

Published : May 25, 2020, 6:35 PM IST

India-China ties
భారత్​- చైనా మధ్య ఉద్రిక్తత

భారత్​- చైనా మధ్య సరిహద్దు వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. పాంగాంగ్, గాల్వన్​ లోయలో భారీగా బలగాలను మోహరిస్తోంది చైనా. దీని వెనుక గల కారణంగా సీనియర్ పాత్రికేయులు సంజీవ్​ బారువా వివరించారు. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్​... వాస్తవాధీన రేఖ వెంబడి మౌలిక సదుపాయాల నిర్మాణం విస్తృతంగా చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

ఒక్కసారిగా భారత్​- చైనా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి భారీగా పీపుల్ లిబరేషన్ ఆర్మీ బలగాలను మోహరిస్తోంది.

ఎల్​ఏసీకి సంబంధించి అపరిష్కృత సమస్యలు చాలానే ఉన్నాయి. అందుకే భారత్​- చైనా గస్తీ సైనికుల మధ్య అనేక సార్లు స్వల్ప ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే అణ్వాయుధ సంపత్తి ఉన్న రెండు పెద్ద దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆసియా దిగ్గజ దేశాలు వ్యూహా, ప్రతివ్యుహాలతో సరిహద్దుల్లో సైనిక బలగాలను మెహరిస్తున్నాయి. తాజాగా జాతీయ వాతావరణ సూచీ జాబితాలో గిల్గిత్ బాల్టిస్థాన్​ పేరును చేర్చింది భారత్.

ఉద్రిక్తతలకు కారణాలు..

భారత్​ చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటానికి గల కారణాలను సీనియర్ పాత్రికేయులు సంజీవ్ బారువా వివరించారు.

1. భారత్​- చైనా మధ్య సరిహద్దుకు సంబంధించి అనేక అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. ఈ సరిహద్దు పూర్తిస్థాయిలో స్పష్టంగా లేదు. వారివారి అవగాహన ప్రకారం సరిహద్దుల్లో గిరి గీసుకుని గస్తీ నిర్వహిస్తారు.

2. భారత్​- చైనా సరిహద్దు హిమాలయాల్లోనే ఉంది. ఇక్కడి ఎత్తైన పరిస్థితులకు తగ్గట్లు చైనా స్థాయిలో భారత్​ మౌలిక సదుపాయాలను కూడబెట్టుకోవాల్సి ఉంది. చైనాతో సమానంగా అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో సైనిక మోహరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి సదుపాయాలు, రవాణా అవసరాలు కీలకంగా ఉంటాయి. వీటిని పొందేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.

భారత్​కు సంబంధించి ఇది అంత సులభమైన విషయం కాదు. చైనాలో ఎత్తైన మైదాన ప్రాంతాలు ఉన్నాయి. ఎత్తైన పీఠభూమి ఉన్నప్పటికీ అక్కడి భూమి సాపేక్షంగా చదునైనది. కానీ భారత్​లో భారీ పర్వత శ్రేణులు, ఎత్తుపల్లాలు అధికంగా ఉంటాయి.

3. మూడో అంశం చాలా ముఖ్యమైనది. భారత్​తో సరిహద్దు వివాదాన్ని చైనా సైన్య సిద్ధాంతకర్తలు 5 ప్రధాన యుద్ధ అంశాల్లో ఒకటిగా భావిస్తారు. దీన్ని పీఎల్​ఏ 'సరిహద్దు ప్రాంత సంయుక్త కార్యాచరణ'గా పిలుస్తారు.

గస్తీ స్థావరాల్లో భారీగా సైనిక సంపత్తి, ఆయుధాలను మోహరిస్తే తప్ప భారత్​ సరిహద్దు యుద్ధానికి సిద్ధం కాలేదని చైనా గట్టిగా నమ్ముతోంది. అందుకు రహదారులు ఇతర సదుపాయాలు కీలకం. అయితే కీలకమైన ప్రాంతాల్లో భారత్​ రహదారులు, మౌలిక సదుపాయాల నిర్మాణంతో చైనా అప్రమత్తమైంది. వీటిని అడ్డుకోవటానికి లేదా ఆలస్యం చేసేందుకు సైనికులతో కుట్ర పన్నుతోంది!

4. వాస్తవాధీన రేఖ వెంబడి రహదారులు, రైలు మార్గాల నిర్మించటంలో చైనా చాలా ముందుంది. భారత్​ ఈ విషయంలో ఆలస్యంగా స్పందించింది. చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకూడదనే ప్రభుత్వ విధానాన్ని 2007లో త్యజించింది. అవసరమైన సమయాల్లో సైనికుల తరలింపును సులభతరం చేయడానికి 'ఇండో-చైనా సరిహద్దు రహదారులు (ఐసీబీఆర్)' కింద 73 రహదారులను నిర్మించేందుకు సిద్ధమైంది.

వీటిలో అత్యంత కీలకమైన 61 రహదారుల నిర్మాణాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజనేషన్​ (బీఆర్​ఓ)కు అప్పగించారు. 22 నిర్మాణాలు 2016లోనే పూర్తయ్యాయి. మిగతా వాటి నిర్మాణం అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల 2022 వరకు పూర్తవుతాయని అంచనా.

5. ఇప్పటివరకు పూర్తయిన రోడ్లలో అత్యంత కీలకమైనవి చాలా ఉన్నాయి. భారత్​- చైనా- నేపాల్​ సరిహద్దులోని లిపులేఖ్ కనుమను అనుసంధానించే రహదారి వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది. దీనిని ఇటీవలే భారత్​ ప్రారంభించింది. మరొకటి 2019లో పూర్తయిన షియోక్​- దౌలత్ బేగ్​ ఓల్డీ (డీబీఓ)ను కలిపే 255 కి.మీ. రహదారి. కారాకోరం కనుమ సమీపంలో ఉన్న ఇక్కడి భారత సైన్య స్థావరం అత్యంత కీలకమైంది.

6. రహదారుల నిర్మాణం, సదుపాయాల మెరుగుదలతో ఈ ప్రాంతంలో సైనికుల కదలికల్లో వేగం పెరిగింది. వీటితో పాటు భారత్​ గస్తీ తీవ్రతను కూడా పెంచింది. గతంతో పోలిస్తే చైనా సైన్యానికి దీటుగా వాహనాలతో కూడిన గస్తీ పెరిగింది.

7. పాక్ ఆక్రమిత కశ్మీర్​, లద్ధాఖ్​లోని అక్సాయిచిన్​పై ప్రణాళికబద్ధంగా దృష్టి సారిస్తోంది భారత్. ఈ విషయంలో దిల్లీ​ వైఖరి పూర్తిగా మారింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్​లోని ఆర్మీ చీఫ్ నుంచి మంత్రుల వరకు పీఓకే, అక్సాయిచిన్​ భారత్​లోని అంతర్భాగమని వ్యాఖ్యానిస్తున్నారు.

పీఓకే వివాదంతో పాటు నియంత్రణ రేఖకు అవతలి వైపున అనేక సమస్యలు ఉన్నాయని భారత్​ పదేపదే గుర్తుచేస్తోంది. కారణం పీఓకేలోని గిల్గిత్ బాల్టిస్థాన్​ నుంచే చైనా-పాక్ ఆర్థిక నడవా(సీపీఈసీ) నిర్మాణం సాగుతోంది. దీనిద్వారా పశ్చిమాసియాను సులభంగా చేరుకోవాలని చైనా ఎప్పటినుంచో భావిస్తోంది. ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి చమురును దిగుమతులకు ఉపయోగించుకోనుంది.

8. నియంత్రణ రేఖపై భారత్​ తీసుకునే ఎలాంటి చర్యలైనా పాక్​- చైనా వ్యూహాత్మక సంబంధాలపై ప్రభావం చూపుతుంది. చైనా ప్రయోజనాలపై విఘాతం కలిగిస్తుంది. ఫలితంగా వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలకు కారణమవుతాయి.

ప్రస్తుతం భారత్​ ఎల్​ఓసీ, ఎల్​ఏసీపై అనుసరిస్తున్న జంట వ్యూహమూ మారే అవకాశం ఉంది. ఇదే కారణంతో భారత్​ చర్యలతో రెండువైపులా ఒకేసారి ప్రభావం పడుతుందని చైనా భావిస్తోంది.

9. భారత్​ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది పాక్​ కాదు.. చైనానే అని భావిస్తోంది దిల్లీ. అంతర్జాతీయంగా పాకిస్థాన్​ను చైనా ఆధారిత దేశంగా పరిగణిస్తున్నారు. భారత్​కు సంబంధించి పాక్​ ప్రాముఖ్యం తగ్గిపోయింది. అంటే భారత్​కు దీర్ఘకాలంలో చైనాతోనే ప్రమాదమని గుర్తించింది. ఈ కారణంతోనే చైనా సరిహద్దు వెంబడి భారత్​ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

10. లద్ధాఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్​ నుంచి భారత్​- చైనా- నేపాల్​, భారత్- చైనా- భూటాన్​ సరిహద్దులపై చైనా బలాన్ని పెంచుకుంటోంది. ఫలితంగా ఉత్తర సరిహద్దుల్లో భారత సైన్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయంలో చైనా వ్యవహార శైలి ఏ మేరకు ఫలిస్తుందో కాలమే సమాధానం చెబుతుంది.

ఏదీ ఏమైనప్పటికీ... అంతర్జాతీయ దౌత్యం, వ్యుహాలు శూన్యంలో ఫలించవు. తైవాన్​ పరిణామాలు; అమెరికా పాత్ర; నేపాల్, భూటాన్​ విశ్వాసాన్ని తిరిగి పొందటం వంటి కీలకాంశాలు భారత్​- చైనా సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి.

ఇదీ చూడండి: 'చైనాతో ఆరోగ్యకర సంబంధాలు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.