ETV Bharat / bharat

పనిచేస్తున్న బ్యాంకుకే ​కన్నం వేసిన ప్యూన్​.. భార్యతో కలిసి రూ.47లక్షల నగలు, డబ్బు చోరీ

author img

By

Published : Dec 20, 2022, 1:19 PM IST

ఓ ప్యూన్​ తాను పనిచేస్తోన్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఓ పథకం ప్రకారం తన భార్యతో కలిసి రెండు లాకర్లలోని విలువైన నగలు, విదేశీ కరెన్సీని మాయం చేశాడు. దీన్ని గుర్తించిన బ్యాంక్​ సిబ్బంది.. వాటి విలువ దాదాపుగా రూ. 47 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.

bank robbery by peon in ahmedabad
బ్యాంక్​లో​ దొంగతనం చేసిన భార్యాభర్తలు

గుజరాత్​లోని ఓ బ్యాంక్​లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ. 47.88 లక్షలు విలువ చేసే.. నగలు, విదేశీ కరెన్సీ అపహరణకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగతనానికి పాల్పడిన బ్యాంక్ ప్యూన్​, అతని భార్యను అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్​ ప్రీతమ్​ నగర్​లోని ఓ బ్యాంక్​లో రెండు లాకర్ల నుంచి బంగారం, వెండి, విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. దీన్ని గుర్తించిన బ్యాంక్​ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. బ్యాంక్​లో పనిచేసే ప్యూన్ చిరాగ్​​ దతానియా, అతని భార్య అర్చనా దతానియా ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.

చిరాగ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. రెండు బ్యాగుల నిండా బ్యాంకు సొత్తును గుర్తించారు. బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీతో పాటుగా మూడు పాస్​పోర్ట్​లను కూడా స్వాధీనం చేసుకొన్నారు. అయితే చోరీకి గురైన వాటిలో కొన్ని నగలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. నిందితులు వాటిని విక్రయించారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.

బ్యాంక్​ అధికారులు​ కొన్నిరోజుల క్రితం లాకర్​ ఛార్జ్​లు చెల్లించని వారి అకౌంట్​లను స్తంభింపచేశారు. వాటిలో ఉన్న విలువైన నగలు, కరెన్సీని రెండు సాధారణ లాకర్లలోకి మార్చారు. దీన్ని గమనించిన ప్యూన్​​.. తన భార్యతో కలిసి ఓ పథకం రచించాడు. చిరాగ్​ భార్య ఓ సాధారణ కస్టమర్​లా బ్యాంక్​లో ప్రవేశించింది. అక్కడ చిరాగ్​ సహాయంతో లాకర్​ రూమ్​లోకి వెళ్లి.. ఈ దొంగతనానికి పాల్పడినట్లు డీసీపీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.