ETV Bharat / bharat

మార్కెట్ వెళ్లొద్దన్న భర్త.. ఇటుకతో తలపై బాది హత్య చేసిన భార్య..

author img

By

Published : Dec 20, 2022, 11:33 AM IST

wife murdered husband
భర్త హత్య

మార్కెట్​కు వెళ్లొద్దన్నాడని భర్తను హతమార్చింది ఓ మహిళ. ఈ దారుణం ఝార్ఖండ్​లో జరిగింది. మరోవైపు, భార్యతో గొడవపడ్డాడు ఓ భర్త. దీంతో ఆమెపై విచక్షణారహితంగా సుత్తితో దాడి చేసి.. పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘోరం ఉత్తరాఖండ్​లో వెలుగుచూసింది.

ఝార్ఖండ్​ ఖుంటీలో దారుణం జరిగింది. మార్కెట్​కు వెళ్లొద్దన్నాడని భర్తను హత్యను చేసింది ఓ మహిళ. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితురాలు కళావతి దేవిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారించగా నిందితురాలు నేరాన్ని అంగీకరించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సోనాగఢ్​పుర్​లో అర్జున్ సింగ్ తన భార్య కళావతి దేవితో కలిసి నివాసం ఉంటున్నాడు. మార్కెట్​కు వెళ్తానని కళావతి.. అర్జున్​ను అడిగింది. ఆమెను మార్కెట్​ వెళ్లొద్దని అన్నాడు అర్జున్​. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తురాలైన కళావతి.. ఇంటి బయట స్నానం చేస్తున్న భర్త అర్జున్​ తలపై ఇటుకతో విచక్షణారహితంగా దాడి చేసింది. అనంతరం భర్తను భుజంపై మోసుకెళ్లి గదిలో పడేసింది. కాసేపటికే అర్జున్ మృతి చెందాడు. నిందితురాలు.. భర్తపై దాడి చేస్తున్న సమయంలో ఆమెను ఆపేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా.. వారిపై కూడా దాడికి యత్నించింది. హత్య అనంతరం నిందితురాలు కళావతి ఇంట్లోనే కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు.

భార్యను సుత్తితో కొట్టి.. పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి
భార్య పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. భార్యపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమెకు మూడు పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని దెహ్రాదూన్​లో జరిగింది. నిందితుడు వీరేంద్ర కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు. నిందితుడు.. భార్య హత్యకు ఉపయోగించిన సుత్తి, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని పింకీ దేవిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతురాలు పింకీ దేవికి వీరేంద్ర కుమార్​ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరేంద్ర.. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిసెంబరు 13 సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య ఓ విషయంలో చిన్న గొడవ జరిగింది. దీంతో వీరేంద్ర ముగ్గురు పిల్లలను గదిలోకి లాక్కెళ్లి.. తలుపు వేశాడు. అనంతరం భార్య వీపుపై సుత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. పింకీ దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని పిల్లలను బెదిరించాడు నిందితుడు. అనంతరం డిసెంబరు 16న పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి భార్యను హతమార్చాడు.

కాళ్లు కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని..
ఝార్ఖండ్ దేవ్​గర్​లో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలికను రైలు ఢీకొట్టడం వల్ల రెండు కాళ్లను పోగొట్టుకుంది. తీవ్రగాయాలతో బాధపడుతున్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థినిని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బైక్​పై వచ్చి కిడ్నాప్ చేశారు. ఆమెకు మత్తుమందు ఇవ్వడం వల్ల స్పృహతప్పి పడిపోయింది. ఉదయం లేచి చూసేసరికి రైల్వే ట్రాక్​పై తన రెండు కాళ్లు తెగి పడి ఉన్నాయని బాధితురాలు.. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.