ETV Bharat / bharat

చైనాకు భారత ఆర్మీ చీఫ్ పరోక్ష​ హెచ్చరికలు

author img

By

Published : Jan 15, 2022, 1:26 PM IST

Army Chief Naravane
ఆర్మీ చీఫ్​

Army Chief Naravane: సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్నైనా భారత సైన్యం సఫలం కానివ్వబోదని తేల్చి చెప్పారు ఆర్మీ చీఫ్​ ఎంఎం నరవణె. సైనిక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. చైనాతో సరిహద్దు వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

Army Chief Naravane: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ భారత సైనిక దళాధిపతి ఎం.ఎం.నరవణె ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. దిల్లీలో సైనిక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్నీ భారత సైన్యం సఫలం కానివ్వబోదని స్పష్టం చేశారు. చైనాతో సరిహద్దు వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించిన నరవణె.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో ఉంచేందుకు ఇటీవల సైనిక అధికారుల స్థాయి 14వ విడత చర్చలు జరిపినట్లు వివరించారు.

పొరుగుదేశం పాకిస్థాన్​ భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహించేందుకు ఇంకా ప్రయత్నాలు సాగిస్తోందని మండిపడ్డారు నరవణె. సరిహద్దుల ద్వారా కశ్మీర్​లోకి చొరబడేందుకు 300-400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

"దేశ సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్నైనా భారత సైన్యం సఫలం కానివ్వదు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే బాగుంది. కానీ పాకిస్థాన్‌... ఉగ్రవాదులను ప్రోత్సహించే తమ అలవాటుకు కట్టుబడి ఉంది. సరిహద్దుల వద్ద శిక్షణా శిబిరాల్లో సుమారు 300- 400 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు. సరిహద్దులో డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి."

--జనరల్‌ ఎం.ఎం.నరవణె.

ఇదీ చదవండి: ఘనంగా సైనిక దినోత్సవం- అమరులకు త్రివిధ దళాల సలాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.