ETV Bharat / bharat

ఆజాద్​కు బిగ్​ షాక్.. 17 మంది నేతలు గుడ్​బై.. తిరిగి కాంగ్రెస్​లో చేరిక

author img

By

Published : Jan 6, 2023, 6:21 PM IST

setback to Ghulam Nabi Azad DAP leaders join Cong
గులాం నబీ ఆజాద్​

దశాబ్దాలుగా కాంగ్రెస్​ పార్టీలో ఉండి.. ఇటీవలే విడిపోయి జమ్ముకశ్మీర్​లో​ సొంత పార్టీ పెట్టిన గులాం నబీ ఆజాద్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 'డెమొక్రటిక్​ ఆజాద్ పార్టీ' స్థాపనలో భాగమైన 17 మంది సీనియర్​ నాయకులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగెళ్లారు. రెండు నెలలు వారంతా సెలవులో ఉన్నారంటూ కాంగ్రెస్​ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆ నేతల్ని స్వాగతించారు.

కాంగ్రెస్​ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ స్థాపించిన జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్​ నాయకులు గులాం నబీ ఆజాద్​కు​ చుక్కెదురైంది. ఆజాద్ స్థాపించిన 'డెమొక్రటిక్​ ఆజాద్ పార్టీ'ను వీడి 17 మంది సీనియర్​ నాయకులు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. ఈ నెల 20న జమ్ముకశ్మీర్​కు చేరనుంది. దానికి ముందుగా వారంతా సొంత గూటికి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ అన్నారు.

జమ్ముకశ్మీర్​ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్​, మాజీ పీసీసీ చీఫ్​ పీర్జాదా మహమ్మద్​ సయ్యద్​, మాజీ ఎమ్మెల్యే బల్వంత్​ సింగ్​ సహా 17 మంది నాయకులు శుక్రవారం దిల్లీ చేరుకుని కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. గాంధీ కుటుంబంతో కశ్మీర్​ ప్రజలకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని వారు అన్నారు. భావోద్వేగాలు, స్నేహం కారణంగా హడావుడిగా పార్టీని వీడి తప్పు చేశామని వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీన్ని ఆ నాయకులంతా 'జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా' అభివర్ణించారు. కశ్మీర్​లో ఉగ్రవాదం పెరిగిందని, దాన్ని అదుపుచేయడం కాంగ్రెస్​ వల్ల అవుతుందని మాజీ పీసీసీ చీఫ్​ పీర్జాదా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ పార్టీని విడిచిపెట్టినందుకు కశ్మీర్​ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు రెండు నెలలు సెలవులో ఉన్నారని.. ఇప్పుడు తిరిగి పార్టీలో చేరుతున్నారని కేసీ వేణుగోపాల్ అన్నారు.

"మేము కాంగ్రెస్​లో 50ఏళ్ల పాటు పనిచేసి చాలా సంపాదించాము.​ పార్టీ నాలాంటి సామాన్యులకు కూడా అవకాశం కల్పించింది. సోనియా గాంధీ నన్ను జమ్ముకశ్మీర్​కు స్పీకర్​, ఉపముఖ్యమంత్రిని చేశారు. డీఏపీలో చేరడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పిదం. తొందరపడి తప్పటడుగు వేశాను. ఒకరి స్నేహం కోసం అలా చేశాను. నన్ను తిరిగి కాంగ్రెస్​లోకి అనుమతిచ్చినందుకు సోనియా గాంధీకి నా కృతజ్ఞతలు"
-- తారా చంద్, జమ్ముకశ్మీర్​ మాజీ ఉపముఖ్యమంత్రి, స్పీకర్​

"కాంగ్రెస్ తమ సొంత పార్టీ అని వారు గ్రహించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో వాతావరణం మారిపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా భారత్ జోడో యాత్రకు హాజరవుతారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో రాహుల్‌కు స్వాగతం పలుకుతారు. అవామీ లీగ్ నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు"
-- రజనీ పాటిల్​, జమ్ముకశ్మీర్​ ఏఐసీసీ ఇన్​ఛార్జ్​

ఆజాద్​ తిరిగి కాంగ్రెస్​లో చేరే అవకాశం ఉందన్న వార్తలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఖండించారు. భారతదేశ ఐక్యతపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరినీ యాత్రకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తిరిగి చేరిన నాయకుల్లో ఎక్కువ మంది డీఏపీ వ్యవస్థాపక సభ్యులని తెలిపారు. వారు బహిరంగంగా రాహుల్​ యాత్రను ప్రశంసించడం వల్ల వారిని ఆజాద్ పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పారు. ఈ రోజు 19 మంది నేతలు కాంగ్రెస్​లో చేరాల్సి ఉండగా.. 17 మంది మాత్రమే దిల్లీ వచ్చి పార్టీలో చేరారని.. మిగిలిన వారు త్వరలోనే వస్తారని ఎంపీ జైరాం​ రమేశ్ తెలిపారు.

ఎదురుదెబ్బ కాదు..
తన విధేయులు కాంగ్రెస్​లో చేరినంత మాత్రాన డీఏపీకి ఇది గట్టి ఎదురదెబ్బ కాదని ఆజాద్​ అన్నారు. 'ఈ ముగ్గురికీ సొంత నియోజకవర్గాలు లేనందున ఇది ఎదురుదెబ్బ కాదు. వారు నా సహచరులు. వారి క్షేమాన్నే నేను కోరుకుంటాను. వారికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడను. డీలిమిటేషన్ జరిగినప్పుడు.. కొన్ని అసెంబ్లీ స్థానాలను కమిషన్ రిజర్వ్ చేసినందున.. ఈ నాయకులకు తమ నియోజకవర్గాలు లేకుండా పోయాయి' అని ఆజాద్ అన్నారు. వారికి ఎన్నికల్లో పోటేచేసే అవకాశం లేనందునే పదవులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అధ్యక్షతన భారత్​ జోడో యాత్ర సెప్టెంబర్​ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. జనవరి 30న శ్రీనగర్​లో జాతీయ జెండాను ఎగురవేసి రాహుల్ దేశవ్యాప్తంగా చేపట్టిని పాదయాత్రను ముగించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.