Punugu Cats in Srisailam temple: శ్రీశైలం పుణ్యకేత్రంలో పునుగు పిల్లులు ప్రత్యక్షం.. ఆధ్యాత్మిక అనుబంధానికి చిహ్నమంటున్న పండితులు
Punugu cats in Srisailam Mallanna temple live: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం మల్లన్న ఆలయ గోపురంపై అరుదైన రెండు పునుగు పిల్లులు ప్రత్యక్షమయ్యాయి. తిరుమల తిరుపతి దేవాలయం (తితిదే)లో కనిపించే ఈ పునుగు పిల్లులు.. ఇప్పుడు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గత నాలుగు రోజులుగా సందడి చేస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో సంచరిస్తూ.. స్వామివారి దర్శననానికి విచ్చేసిన భక్తులను అలరిస్తున్నాయి. వీటి రాకతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. నల్లమల అడవుల్లో పునుగు పిల్లులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు భావిస్తున్నారు.
సుగంధ ద్రవ్యాలు అందించే జీవులు పునుగు పిల్లులు.. ఈ పునుగు పిల్లుల ప్రత్యేకత ఏమిటి..? ఇవీ ఎక్కువగా ఎక్కడుంటాయి..? తిరుమల శ్రీవారికి, ఈ పునుగు పిల్లులకు అవినాభావ సంబంధం ఏంటి..? అనే అంశాలను పరిశీలిస్తే పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునుగు పిల్లుల విశిష్టత గురించి తిరుమలలో ఎక్కువగా వింటుంటాం. తిరుమల శ్రీవారి అభిషేక సేవకు వినియోగించే సుగంధ ద్రవ్యాలను అందించే జీవులుగా ఈ పునుగు పిల్లులు ప్రసిద్ధికెక్కాయి. ఈ పిల్లుల నుంచి తీసిన తైలాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత కాస్తంత పునుగు పిల్ల తైలాన్ని విగ్రహానికి పూస్తారని చెబుతుంటారు. ఇవి చాలా అరుదుగా కనిపించే జీవులు. గతకొంత కాలంగా ఈ పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో.. తితిదే ప్రత్యేకంగా తిరుమలలోని గోశాలలో ఈ పునుగు పిల్లులను పెంచుతుంది. ఈ పునుగు పిల్లులు ఎక్కువగా నల్లమల్ల అడవులలో సంచరిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న అడవుల నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయానికి పునుగు పిల్లులు సంచరించటం ఆధ్యాత్మిక అనుబంధానికి చిహ్నంగా నిలుస్తోందని పండితులు పేర్కొంటున్నారు.