MLA Eluru Sambasiva Rao Comments on Chandrababu Arrest: "జగన్కు ఉన్న అవినీతి మచ్చను అందరికీ అంటించాలని చూస్తున్నారు"
MLA Eluru Sambasiva Rao Comments on Chandrababu Arrest : మాజీ సీఎం చంద్రబాబుపై ఎలాగైనా అవినీతి మరకవేయాలని సీఎం జగన్ ప్రయత్నమని టీడీపీ నేత, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆరోపించారు. 38 కేసుల్లో జగన్ ముద్దాయన్న (Jagan is Accused in 38 Cases) ఆయన, అనేక కేసుల్లో ఏ1 గా ఉన్నారని, అందువల్ల ప్రభుత్వాలే ఆయనపై కేస్ పెట్టాయని గుర్తు చేశారు. జగన్కి సంబంధించి ఈడీ, సీబీఐ 5 వేల కోట్ల రూపాయలు జప్తు చేసిందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేస్లో (AP Skill Development Case) ఎక్కడా అవినీతి జరగలేదని, ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిర్ధారణ కాలేదని తెలిపారు. 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి తనకు అంటిన బురదను పక్క వారికి అంటించే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఏలూరు సాంబశివరావు మండిపడ్డారు.
జీ-20(G-20) గురించి ప్రపంచం మాట్లాడుతుంటే, ఏపీలో మాత్రం జగన్ చేసిన 420 పనుల గురించి మాట్లాడే పరిస్థితి ఉందని విమర్శించారు. నిన్న బంద్కి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. విచారణ పేరుతో చంద్రబాబుని సిట్ కార్యాలయంలో మానసికంగా వేధించారన్నారు. కలిసి కట్టుగా పని చేసి జగన్కి బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దని ఏలూరు సాంబశివరావు కోరారు.