అత్యంత వైభవంగా మలయప్పస్వామివారి పుష్పయాగం - 3 రాష్ట్రాల నుంచి 11రకాలు పూలు
Published: Nov 19, 2023, 4:20 PM

Malayappa Swamy Pushpa Yagam In Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర కార్తికమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్ప యాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి అంగరంగ వైభవంగా పుష్పార్చన చేశారు. అంతకు ముందు ఆలయంలోని సంపంగి ప్రాకారం గల కల్యాణమండపంలో ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేపట్టారు.
మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మలయప్పస్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యాన్ని అర్చకులు చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ పుష్పయాగానికి కర్ణాటక నుంచి 2టన్నులు, తమిళనాడు నుంచి 4టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2టన్నుల పుష్పాలను తెప్పించినట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.