గడువు ముగిశాక కరవు మండలాలు ప్రకటిస్తే కేంద్ర బృందాలు ఎలా వస్తాయి? ప్రభుత్వంపై ధూళిపాళ్ల ధ్వజం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 3:34 PM IST

thumbnail

Dhulipalla Narendra on Declaration of drought zones : సకాలంలో కరవు మండలాలు ప్రకటించకపోవడం వల్ల... జీవో 4 ఎందుకూ పనికి రాదని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు. కలెక్టర్లు 470 కరవు మండలాలు ప్రతిపాదిస్తే, వాస్తవాలు మార్చి 103 మండలాలు మాత్రమే ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్-30వ తేదీలోగా ప్రకటించాలని డ్రాట్ మాన్యువల్ స్పష్టం చేస్తుంటే, నిబంధనలకు విరుద్దంగా కరవు మండలాలను సమయం గడిచాక ప్రకటించారని  ధూళిపాళ్ల మండిపడ్డారు. రైతులను మోసం చేసేలా కరవు మండలాల ప్రకటన ఉందని ఆక్షేపించారు. ఈ విధంగా వ్యవహరిస్తే కేంద్రం నుంచి కరవు బృందాలు ఎలా వస్తాయి.. కేంద్రం ఎలా సాయం చేస్తుందని ప్రశ్నించారు. 

పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కరవు వల్ల 30 వేల కోట్ల నష్టం వచ్చిందని కేంద్రానికి నివేదించిందని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. కరవు నివేదికను జగన్ ప్రభుత్వం ఎందుకు సిద్దం చేయడం లేదని నిలదీశారు. ఏపీలో వ్యవసాయ శాఖ చచ్చిపోయిందని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ మంత్రి  మాపై విమర్శలు చేయడం తప్ప.. ఆ శాఖ గురించి మాట్లాడ్డం ధూళిపాళ్ల విమర్శించారు. కరవు మండలాలుగా ప్రకటించడం మినహా నిధులేమైనా విడుదల చేశారా లేదా అని ప్రశ్నించారు. సీఎం విశాఖలో ఓ అంతర్జాతీయ సదస్సులో కూర్చొని.. నీళ్లు కుండలో పోస్తున్నారు. కుండలో నీళ్లు పోయడం కాదు.. మా పొలాల్లో నీళ్లు ఎప్పుడు పారిస్తారని రైతులు అడుగుతున్నారన్నారు. రైతుల పాలిట జగన్ కసాయి సీఎంగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. సోకుల కోసం కోట్లు ఖర్చు పెట్టుకుంటూ.. కరవు నివారణకు రూపాయి ఇవ్వరా ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.