Canal Repair Works Delay: సాగు, మురుగు కాలువలను పరిశీలించిన టీడీపీ నేతలు..
Govt Negligence Towards Farmers : బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని కంకటపాలెం, మురుకుండపాడులో సాగు, మురుగు నీటి కాలువలను ప్రారంభించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలల్లో ఒక్కసారి కూడా కాలువల్ని శుభ్రం చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ కాలువల్ని శుభ్రం చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని టీడీపీ నేత మానం విజేత విమర్శించారు. మండల పరిధిలోని కంకటపాలెం మురుగొండపాడులో సాగు, మురుగు నీటి కాలువలను రైతులతో కలసి టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువల్లో గుర్రపు డెక్క, తూటుకాడ విపరీతంగా పెరిగి కాలువలు రూపు రేఖలు కోల్పోయాయని వారు అన్నారు. కట్టలు బలహీనంగా మారాయని వారు ఆరోపించారు. కాలువల దారుణంగా ఉండడం వల్ల చివరి ఆయకట్టుకు సాగు నీరు సక్రమంగా అందడం లేదని వారు విమర్శించారు. భారీ వర్షాలు కురిస్తే వేల ఎకరాల్లో పంటలు ముప్పు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కాలవల్లో యుద్ధ ప్రతిపాదికన మరమ్మతుల పూర్తి చేయించాలని డిమాండ్ మానం విజేత చేశారు.