ETV Bharat / state

అప్పుడు హడావుడి.. ఇప్పుడు మౌనం.. విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై సీఎం జగన్​ తీరు

author img

By

Published : Apr 11, 2023, 7:18 AM IST

CM Jagan is silent on the privatization of Visakha steel plant: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు కేంద్రంతో పోరాటాలు చేస్తానని ఎన్నో బీరాలు పలికిన జగన్.. అధికారం చేపట్టాక కేంద్ర ప్రభుత్వంతో బేరాలు ఆడుతున్నారని ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో పోరాడి ఏదైనా సాధిస్తామని చెప్పినా సీఎం.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్రంతో ఎందుకు యుద్ధం చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు.

CM Jagan
CM Jagan

CM Jagan is silent on the privatization of Visakha steel plant: ఎన్నికల ముందు కేంద్రంతో పోరాడి ఏదైనా సాధిస్తామని డాంబికాలు... అధికారంలోకి వచ్చాక దిల్లీ పెద్దలకు మెడలు వంచి దండాలు పెట్టడం.. ఇదీ మన సీఎం సారు పరిస్థితి. ప్రత్యేకహోదా, విభజన హామీలు, పోలవరం నిధుల నుంచి ప్రారంభమైన ఈ తీరు.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ కొనసాగుతోంది. నిధులు, ముడిసరుకు కోసం స్టీల్‌ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈఓఐ) జారీ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. మన ప్రభుత్వం నుంచి మాత్రం కనీస స్పందన లేదు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఎంతో మంది ప్రాణాలొడ్డి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ.. మనది కాకుండా పోయే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.

వైసీపీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతా..: 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతా. ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ సాధిస్తా. ఎన్నికలకు ముందు ఇలా ఎన్నో బీరాలు పలికారు సీఎం జగన్‌. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం దగ్గర ఆయనే మెడలు వంచారు. వంచుతూనే వస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైనా.. ఇంతవరకూ ప్రత్యేక హోదా ఊసే లేదు. విభజన సమస్యలు, హామీల పరిష్కారం సంగతైతే.. జగన్‌ సారు మర్చేపోయారు. వేలమంది పోరాటాలు, 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుపైనా.. అంతే చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పినా.. తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు మూలధనం, ముడిసరకు లేక ఇబ్బంది పడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం.. నిధులు లేదా ముడిసరకు సమకూర్చి దానికి సరిపడా ఉక్కు ఉత్పత్తుల్ని పొందేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఈ మేరకు మార్చి 27న ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది.

టీఎస్‌కున్న తాపత్రయం - ఏపీకీ లేదు: మూలధన పెట్టుబడుల సమీకరణకు విశాఖ ఉక్కు ఈఓఐ జారీ చేసిన తర్వాత ఉక్కు అధికారుల సంఘం.. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి లేఖలు రాసింది. రాష్ట్రంలోని పేదల ఇళ్ల నిర్మాణానికి సుమారు 10 లక్షల టన్నుల ఉక్కు అవసరమవుతుందని, దాని విలువ 6,500 కోట్ల నుంచి 7 వేల కోట్ల వరకు ఉంటుందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. అంతేకాకుండా, వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ నుంచే ఉక్కును కొనేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈఓఐలో పాల్గొనాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా విజ్ఞప్తి చేయగా.. వెంటనే స్పందించిన కేటీఆర్ ఈఓఐ ఒక కుట్ర అంటూ మొదట కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, ఆర్థిక సాయం చేసి ప్రభుత్వ రంగంలో ఉంచాలని, లేదా సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈఓఐలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం ప్రయత్నాలను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చెప్పలేం. కానీ, విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న తాపత్రయమైనా ఏపీ ప్రభుత్వానికి లేకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎన్నికల ప్రచారంలో గొప్పలు-ఇప్పుడు మౌనదీక్షలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారంలోకి వస్తే ఒడిశా రాష్ట్రం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి విశాఖ ఉక్కుకు సొంత గనుల కోసం కృషి చేస్తామని.. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులకు జగన్‌ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తండ్రి వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడే.. విశాఖ ఉక్కు దివాలా తీయకుండా కాపాడారని, ఆయన హయాంలోనే స్టీల్‌ప్లాంట్‌ విస్తరణకు వెళ్లిందని ఎన్నికల ప్రచారంలోనూ గొప్పలు చెప్పారు. తాను కూడా విశాఖ ఉక్కుకు అండగా ఉంటానన్నారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీవీఎంసీ కార్యాలయం నుంచి స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ వరకు పాదయాత్ర చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించి ప్రధాని మోదీకి పంపినట్లుగా ఒక లేఖను.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వైసీపీ నేతలు బయటపెట్టారు.

సీఎం జగన్‌కు సుత్తిలేకుండా సూటి ప్రశ్నలు: సీఎం జగన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే ఎక్కువసార్లు దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తున్నారు. వెళ్లినప్పుడల్లా ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ వినతిపత్రం ఇచ్చారంటూ సీఎంవో ప్రకటన విడుదల చేస్తుంటుంది. అందులో అంశాలేవీ పరిష్కారానికి నోచుకోకపోయినా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఉంటుంది. అలాంటిది విశాఖ ఉక్కుపై 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించి ప్రధానికి పంపితే.. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అన్ని రోజులు గోప్యంగా ఎందుకు ఉంచింది..? ఎమ్మెల్సీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే దాన్ని ఎందుకు బయటపెట్టింది..? 120 మంది ఎంపీల మద్దతు సాధించినప్పుడు వారిలో కొందరిని తీసుకెళ్లి నేరుగా ప్రధానిని కలవచ్చు కదా? కనీసం వైకాపాకు ఉన్న 31 మంది ఎంపీలను తీసుకుని సీఎం ఎప్పుడైనా ప్రధానిని, కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిశారా..? అఖిలపక్ష నేతలతో ఒక్క సమావేశమైనా పెట్టారా..? విశాఖ ఉక్కు పరిరక్షణపై వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్థమవుతోంది. అసెంబ్లీలో ఏదో మొక్కుబడిగా చర్చించి, ఒక తీర్మానం చేస్తేనో, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి లేఖలు రాసి చేతులు దులిపేసుకుంటేనో సరిపోతుందా..? కేంద్రంపై ఒత్తిడి చేయకుండా.. ఏ మొహమాటాలు, ఏ అవసరాలు, ఏ బలహీనతలు వైసీపీ నేతలకు అడ్డొస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం పలు వేదికలపై స్పష్టం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేష్టలుడిగి చూస్తోంది..? ఇవన్నీ వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు సుత్తిలేకుండా, సూటిగా అడుగుతున్న ప్రశ్నలు.

టీడీపీ హయాంలో వెనక్కి తగ్గిన కేంద్రం: భారీ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలు ఉద్యమానికి సైతం సిద్ధమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే, రాష్ట్ర ప్రభుత్వం, వివిధ వర్గాలు తీవ్ర అభ్యంతరం, నిరసన తెలిపాయి. దాంతో కేంద్రం వెనక్కి తగ్గింది. కేరళలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్‌ న్యూస్‌ ప్రింట్‌ లిమిటెడ్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తే, ఆ రాష్ట్ర ప్రభుత్వమే బిడ్‌లో పాల్గొని 146 కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకుంది. నష్టాల్లో ఉందని పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ఉక్కు పరిశ్రమను మూసేయడానికి, కర్ణాటకలోని భద్రావతి, తమిళనాడులోని సేలం ఉక్కు కర్మాగారాలను ప్రైవేటీకరించడానికి చేసిన ప్రయత్నాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. సింగరేణి గనుల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను అమ్ముతామంటే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో... కేంద్రం దిగొచ్చింది. సింగరేణి గనుల్ని ప్రైవేటీకరించబోమని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటించారు. అప్పుడే విశాఖ వచ్చిన ప్రధాని.. విశాఖ ఉక్కు అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధానికి అర్థంకాకుండా తెలుగులో ముక్తసరిగా మాట్లాడి మమా అనిపించారు.

వైసీపీది చేతగానితనం: గతంలో విశాఖ ఉక్కు సమస్యల్లో ఉన్నప్పుడు.. అప్పటి సీఎంలు, ఎంపీలు చొరవ తీసుకుని గట్టెక్కించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌.. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా అప్పటి టీడీప పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రన్నాయుడు అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఉక్కు, బొగ్గుకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో వైసీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తొలి నుంచీ సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఒకరు స్థానిక ఎంపీ. మరొకరికి విశాఖలో వ్యాపార ప్రయోజనాలున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణకు వీరేమీ చేయలేదు సరికదా కనీసం ఆ పరిశ్రమను సందర్శించలేదు. యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడనూ లేదు. దీన్నిబట్టే వైసీపీ చేతగానితనం మరోసారి స్పష్టమవుతోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.