ETV Bharat / state

TDP agitation : రైతులను పట్టించుకుంటారా.. ఇళ్లకు స్టిక్కర్లు అంటించుకుంటారా : ప్రభుత్వంపై టీడీపీ మండిపాటు

author img

By

Published : May 8, 2023, 10:56 PM IST

రైతుల సమస్యపై టీడీపీ ఆందోళన
రైతుల సమస్యపై టీడీపీ ఆందోళన

TDP agitation for farmers : రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. రైతులకు అండగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యాన.. ఎక్కడికక్కడ ఆందోళనలు మిన్నంటాయి. రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమాల్లో టీడీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు పొలాల్లో పర్యటించి నిలదీసే వరకూ ఈ ప్రభుత్వం మేల్కోలేదని విమర్శించారు. తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

TDP agitation for farmers : నందిగామ మండలం లింగాలపాడులో దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి దెబ్బతిన్న పంట పొలాలలో పర్యటించిన ఆయన.. జగన్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాలలో పర్యటించి ప్రభుత్వాన్ని నిలదీసే వరకు గోనెసంచులు, పట్టాలు కూడా ఇవ్వలేదన్నారు. పంట మునిగింది పరిహారం ఇవ్వండి అంటూ రైతుల పక్షాన తెలుగుదేశం పోరాటం చేస్తుందన్నారు. నాలుగేళ్లుగా ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి 4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని దేవినేని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఇంత పెద్ద ఎత్తున దెబ్బతింటే పరదాల ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రాసాదం వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న, తడిసిన, మొలకెత్తిన పంటలను చంద్రబాబు పరిశీలించే వరకు ప్రభుత్వంలో.. అధికారుల్లో కదలిక లేదని మండిపడ్డారు. లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతింటే.. కేవలం 60 వేల ఎకరాలేనని తప్పుడు లెక్కలు చెప్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన మొక్కజొన్న, ధాన్యం సహా దెబ్బతిన్న అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం విఫలమైంది.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. పంట నష్టంపై రైతులతో కలిసి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన నిర్వహించింది. మొలకెత్తిన కంకులను కుప్పగా పోసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు.

స్పష్టమైన ప్రకటన చేయాలి.. మోపిదేవి తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. వర్షాలకు నష్టపోయిన ఉద్యాన పంటలకు పరిహారం చెల్లించాలని, తడిసిన, రంగు మారిన మొక్కజొన్న మొత్తాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదని బైఠాయించారు. ఒక పక్క రైతులు ఆకాల వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. దళారులు రైతులతో మాట్లాడుతూ మిల్లర్లతో సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్తున్నారంటే అందులోనూ కమిషన్ కొట్టాలన్న దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.

తక్షణ సాయం అందించాలి.. అకాల వర్షాలతో కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేశారని, పంట కోల్పోయిన ప్రతి రైతుకు 25 వేల రూపాయలు తక్షణ సహాయం అందించాలని రాష్ట్ర రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. రవాణా చార్జీలు రైతులకు అదనపు భారం కాగా.. మధ్య వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఉందని అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలని కోరారు.

కొనుగోళ్లలో అవకతవకలు.. తడిసిన, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో వద్ద ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో అనేక అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలో అనేక వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, రైతులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని రేటు తగ్గించడం సరైన పద్ధతి కాదన్నారు. తడిసిన ధాన్యాన్ని అరబెట్టేందుకు ప్రభుత్వం టార్ఫాలిన్లు కూడా అందుబాటులో ఉంచడం లేదన్నారు. ప్రభుత్వం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకూ టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రైతులు ఇబ్బందులు.. రైతు పక్షం అని ప్రగల్భాలు పలుకుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్నదాతలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం నుంచి రామన్నగూడెం వెళ్లే రహదారిలో మండుటెండలో ధాన్యం రాశులపై కూర్చుని నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రైతులను పరామర్శించడం మానేసి తో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.