కృష్ణా జిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గంలో అనుమతులు లేని భూముల్లో.. ఇళ్ల స్థలాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రివర్ కన్జర్వేటరీ, వోల్టా చట్టాలను ఉల్లంఘించి అవనిగడ్డ గ్రామ శివారు కరకట్ట దిగువన.. కృష్ణానదికి మధ్య పాత ఎడ్లలంక గ్రామంలో ఉన్న భూములు నివేశనా స్థలాల కోసం కొనుగోలు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
దానిలో మెరక చేసి ఇచ్చినా వరద ముంపునకు గురవుతాయని బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మంచి విషయమన్నారు. కానీ.. నివాసానికి అనువైన ప్రాంతంలో ఇవ్వకుండా.. చట్టాలను ఉల్లంఘించి అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోపిదేవి నుండి అయోధ్య కృష్ణానది పాత కరకట్ట క్రింద స్మశానం ప్రక్కన ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: ఈఎస్ఐ కేసులో ముగిసిన మూడు రోజుల విచారణ