ETV Bharat / sports

వన్డే ప్రపంచకప్​పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. పాక్​కు రీకౌంటర్​

author img

By

Published : Oct 20, 2022, 3:38 PM IST

2023 వన్డే ప్రపంచకప్‌, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ విషయంలో పీసీబీ చేసిన వ్యాఖ్యలపై​ తాజాగా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. ఏమన్నారంటే..

ODI Worldcup Anuragthakur
వన్డే ప్రపంచకప్​ అనురాగ్​ ఠాకూర్​

వచ్చే ఏడాది ఆసియా కప్‌ పాకిస్థాన్‌ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ఇటీవలే ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్‌లో కాకుండా తటస్థ వేదికపై ఆసియా కప్‌ ఆడతామని ఆయన అన్నారు. దీంతో ప్రతిస్పందించిన పీసీబీ.. బీసీసీఐపై మండిపడింది. పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. తటస్థ వేదికగా ఆడతామంటే.. తాము భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీతో సహా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి వైదొలుగుతామని వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో సహా అన్ని పెద్ద జట్లూ పాల్గొంటాయని స్పష్టం చేశారు.

"వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించే బాధ్యత బీసీసీఐదే. అందుకే ఇది బీసీసీఐ విషయం. ఆ బోర్డే స్పందించాలి. భారత్ క్రీడలకు పవర్‌హౌస్‌లాంటిది. చాలా ప్రపంచకప్‌లను ఇక్కడ నిర్వహించాం. అలాగే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. అందులో పాక్‌తో సహా పెద్ద జట్లన్నీ తప్పకుండా పాల్గొంటాయి. భారత్‌ నుంచి క్రీడలను వేరు చేయలేం. క్రికెట్‌తో సహా చాలా క్రీడల్లో భారత్‌ పాల్గొంటుంది. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన అంశాలను కేంద్ర హోం శాఖ చూసుకొంటుంది. క్రికెట్‌కు సంబంధించినదే కాకుండా ఆటగాళ్ల భద్రత కూడా చాలా కీలకం. ఎవరి మాటను వినే అవసరం భారత్‌కు లేదు. మమ్మల్ని ఎవరూ డిక్టేట్‌ చేయలేరు" అని అనురాగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ అక్టోబర్‌ 23న తలపడనుంది.

ఇదీ చూడండి: T20 World Cup: టీమ్‌ఇండియాలో 'ఆ నలుగురు'.. ఎలా రాణిస్తారో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.