ETV Bharat / opinion

విశ్వశాంతికి ప్రథమ శత్రువుగా పాకిస్థాన్

author img

By

Published : Sep 30, 2021, 7:26 AM IST

ముష్కర మూకలకు పాక్‌ పుట్టిల్లు అని అమెరికా కాంగ్రెస్‌ పరిశోధన కేంద్రం(సీఆర్‌ఎస్‌) తాజాగా తేల్చిచెప్పింది. ఇందులో కొన్ని సంస్థలకు భారత్​లో మారణహోమం సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ నిఘాను పటిష్ఠపరిస్తేనే- పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాద తండాల ఆటలను నియంత్రించగల వీలుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

pakistan
విశ్వశాంతికి ప్రథమ శత్రువుగా పాకిస్థాన్

ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనదిగా పాకిస్థాన్‌ను (Terrorism in Pakistan 2021) అమెరికా మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ రెండేళ్ల క్రితం ఈసడించారు. నూటికి నూరుపాళ్లు అది నిజమేనని చాటుతూ- రక్తం రుచిమరిగిన డజను ముష్కర మూకలకు పాక్‌ పుట్టిల్లు అని అమెరికా కాంగ్రెస్‌ పరిశోధన కేంద్రం(సీఆర్‌ఎస్‌) తాజాగా తేల్చిచెప్పింది. వాటిలోని అయిదు ఆటవిక తండాలు- లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌, హర్కతుల్‌ జిహాద్‌ ఇస్లామీ, హర్కతుల్‌ ముజాహిదీన్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు ఇండియాలో మారణ హోమం సృష్టించడమే ఏకైక లక్ష్యమని అది స్పష్టీకరించింది. ఉగ్రవాద మిన్నాగులను ముద్దుచేసే ఇస్లామాబాద్‌ దుర్విధానాలను సీఆర్‌ఎస్‌ నివేదిక సూటిగా ఆక్షేపించింది. అదే సమయంలో అటు కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో చొరబాటుకు దుస్సాహసం చేసిన లష్కరే ముష్కరులను సమర్థంగా నిలువరించిన భారత సైన్యం- వారిలో ఒకడిని (pakistan terror attack in india) సజీవంగా పట్టుకొంది. పందొమ్మిదేళ్ల ఆ ఉగ్రవాదిని పాక్‌లోని పంజాబ్‌ ప్రాంతానికి చెందిన అలీ బాబర్‌ పాత్రాగా గుర్తించారు.

'మాకు శిక్షణ ఇచ్చింది పాకిస్థాన్‌ సైన్యమే' అని విలేకరుల ముందు అతగాడు (pakistan terror attack in india) అసలు నిజం కక్కేశాడు. పేద యువకులకు డబ్బుల ఆశచూపి, భారత్‌పై విద్వేషం నూరిపోసి సరిహద్దులను దాటిస్తున్నట్లు వెల్లడించాడు. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులకు ఇండియా శిక్షణ ఇస్తున్నట్లు ఇటీవల కారుకూతలు కూసిన పాకిస్థాన్‌ నేతాగణం- దీనికి ఏమని జవాబిస్తుంది? అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదులుగా అభివర్ణించే వారందరూ తమకు 'హీరోలు' వంటి వారని పర్వేజ్‌ ముషారఫ్‌ లోగడ నిర్లజ్జగా ప్రకటించుకున్నారు. విదేశాలపై విరుచుకుపడటానికి ఉగ్రశిక్షణ పొందిన దాదాపు 40 వేల మంది తమ దేశంలో తిష్ఠ వేశారని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం గతంలో ఒప్పుకొన్నారు. ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా అమలు చేస్తున్న ఆ ధూర్తదేశం- ఆర్థికాభివృద్ధిలో పోనుపోను దిగనాసిపోతోంది. విద్వేషశక్తుల అభయారణ్యంగా విరాజిల్లుతూ విశ్వశాంతికే పెనుముప్పుగా పరిణమించింది!

పాకిస్థాన్‌ వార్షిక తలసరి ఆదాయ వృద్ధి- దక్షిణాసియా సగటులో (Economy of Pakistan) సగానికి లోపే! అక్కడి జనాభాలో దాదాపు 40 శాతం ఆకలి బాధలతో అల్లాడుతున్నారు. ఉగ్రవాదాన్ని నెత్తికెత్తుకొంటున్నందుకు అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ఇటీవల కన్నెర్రచేసి, 'నిశిత పర్యవేక్షణ జాబితా'లోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించినా- పాక్‌ వక్రబుద్ధి మారడం లేదు. సొంత ప్రజల బాగోగులను గాలికొదిలేసి ఇండియాపై ముష్కర మూకలను ఎగదోయడమూ మానడం లేదు. కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (TRF terror group) పేరిట లష్కరేకు కొత్త రూపునిచ్చి లోయలో నెత్తుటి నెగళ్లను రాజేస్తోంది. భద్రతా బలగాల దృష్టిలో లేని యువకులను గుర్తించి, 'పార్ట్‌టైమ్‌' ఉగ్రవాదులుగా వారిని తీర్చిదిద్ది- రాజకీయ నేతలు, పోలీసులు, సామాజిక కార్యకర్తలను అంతమొందించే హేయకుట్రలకు ఐఎస్‌ఐ ఇటీవల తెరతీసింది.

డ్రోన్లతో ఆయుధాల సరఫరా మొదలు సామాజిక మాధ్యమాల్లో ఛాందస భావజాల వ్యాప్తితో యువతను రెచ్చగొట్టడం వరకు ఇండియాపై ప్రచ్ఛన్న యుద్ధమే సాగిస్తోంది. చైనా మద్దతు, తాలిబన్ల తోడ్పాటుతో రాబోయే రోజుల్లో కశ్మీర్‌లో రావణకాష్ఠాలను పెద్దయెత్తున రగలించాలని తలపోస్తోంది. సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ ఆసేతుహిమాచలం నిఘాను పటిష్ఠపరిస్తేనే- పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాద తండాల ఆటలను నియంత్రించగల వీలుంటుంది. కశ్మీర్‌ రాజకీయ పక్షాలతో చర్చలు సాగిస్తూనే స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలను జోరెత్తించే ద్విముఖ వ్యూహంతో కేంద్రం ముందుకు సాగాలి. ఆర్థిక వనరులను కట్టడి చేసి ముష్కరులను పద్మవ్యూహంలో ఇరికించాలన్న కార్యాచరణ ప్రణాళికలో భాగస్వాములయ్యేలా ప్రపంచ దేశాలను కూడగట్టాలి!

ఇదీ చూడండి : 'వారి దృష్టిలో భారత్​ అంటే.. భూభాగమే.. ప్రజలు కాదు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.