తుర్కియే, సిరియాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. 360 మంది మృతి

author img

By

Published : Feb 6, 2023, 10:01 AM IST

Updated : Feb 6, 2023, 12:28 PM IST

Turkey syria earthquake

09:59 February 06

తుర్కియే, సిరియాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. 360 మంది మృతి

తుర్కియే, సిరియాలను భారీ భూకంపం వణికించింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మొత్తం 360 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూకే జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ పేర్కొంది. భూకంపం ధాటికి పలు భారీ భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలిపారు. భూకంపం కారణంగా అనేక ఇళ్లు కూలి సుమారు వంద మంది చనిపోయినట్లు ప్రాథమికంగా అధికారులు వెల్లడించారు. తుర్కియేలో భవనాలు కూలి 120 మందికి పైగా చెందినట్లు పేర్కొన్నారు. సిరియాలో ప్రభుత్వ అధీనంలో ఉ్న ప్రాంతాల్లో ఇప్పటివరకు 237 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గజియాన్టెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సిరియాకు సరిహద్దుగా ఉండే గజియాన్టెప్ ప్రాంతం.. తుర్కియే ప్రధానమైన పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఈ భూకంపం ప్రభావంతో.. లెబనాన్‌, సైప్రస్‌లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంపం తర్వాత తుర్కియేలోని కహ్రామన్మరాస్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

తుర్కియేలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్‌ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 1999లో టర్కీ చరిత్రలో అత్యంత భీకర ప్రకృతి బీభత్సాన్ని చవిచూసింది. ఆ ఏడాది 7.4 తీవ్రతతో భూకంపం సంభింవించి 17వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000 మంది మరణించారు.

ప్రధాని మోదీ సంతాపం..
తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. "తుర్కియే, సిరియాలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకారం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. తుర్కియేకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించేందుకు భారత్​ సిద్ధంగా ఉంది" అని మోదీ ట్వీట్​ చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్​ 2023 కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. మరోసారి తుర్కియే భూకంప ఘటనపై మాట్లాడారు. బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Last Updated :Feb 6, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.