ETV Bharat / city

సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ మంటల్లో కలిపేశారు: తెదేపా

author img

By

Published : Apr 4, 2022, 7:58 PM IST

సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ మంటల్లో కలిపేశారు
సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ మంటల్లో కలిపేశారు

సామాజిక న్యాయాన్ని మంటల్లో కలిపేయటంతోపాటు తలాతోక లేకుండా జిల్లాల విభజన చేశారంటూ ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతలు మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రానికి.. తల లేని మొండెంలా జగన్ కొత్త జిల్లాలను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.

సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్ మంటల్లో కలిపేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. తిరుపతిలో కలెక్టర్​, ఎస్పీ సహా మెుత్తం 18 మంది ఉన్నతాధికారులను రెడ్డి సామాజిక వర్గం వారినే నియమించారని ఆరోపించారు. "ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తే.. దాన్ని లౌకికవాదమంటారా? ప్రజస్వామ్య పాలనంటారా? తన వారికి బంగారు పళ్లెంలో పెడుతూ.. ఇతర సామాజిక వర్గాన్ని దూరం పెట్టడం ప్రజాస్వామ్యబద్ధం కాదు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకకవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి తక్షణమే అత్యవసర చికిత్స చేయాలి." అని అన్నారు. కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకంలో ఒక్క ఎస్సీ వర్గానికి చెందిన వారిని కూడా నియమించకపోవటం పట్ల వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ విషయం జగన్​కు తెలుసా..?: కుప్పం గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు.. పులివెందులలో బస్టాండ్ కూడా లేదన్న విషయం తెలుసా? అని మాజీమంత్రి జవహర్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ తలాతోక లేకుండా జిల్లాల విభజన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి తల లేని మొండెంలా జగన్ కొత్త జిల్లాలను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఉదయం జిల్లాల ప్రకటన వెలువడితే.. సాయంత్రానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచటం వెనుక అంతర్యం ఏమిటని నిలదీశారు. అంబేడ్కర్​, బాబూ జగజ్జీవన్ రామ్​ల పేర్లు జిల్లాలకు పెట్టాలని ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. కల్తీసారా, జే బ్రాండ్ మద్యం, విద్యుత్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసర ధరల గురించి ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశ్యంతోనే జగన్ కొత్త జిల్లాల నాటకం మొదలెట్టారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: వికేంద్రీకరణే మా విధానం.. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.